కేసీఆర్, జగన్పై బీజేపీ ఫైర్- మద్యం షాపులపై లేని ఆంక్షలు గణేశ్ పండుగపై ఎందుకని ప్రశ్న..
కరోనా వ్యాప్తి అల్లకల్లోలం రేపుతున్న వేళ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపుతోంది. వినాయక చవితి సందర్భంగా వేసే గణేశ్ మండపాలపై నిషేధం విధిస్తూ తాజాగా ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. వీటిపై ముందు నుంచీ ఆగ్రహంగా ఉన్న బీజేపీ.. కరోనా పేరుతో రాజకీయాలు మంచివి కావని హెచ్చరించింది..
Recommended Video
ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం మద్యం షాపులు నడుస్తున్నాయని, వాటిపై లేని ఆంక్షలు గణేశ్ పండుగపై ఎందుకని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎంలో కేసీఆర్, జగన్ను ప్రశ్నించారు. దీనిపై ఇరువురు సీఎంలు ఓసారి ఆలోచించాలని సూచించారు. వినాయక చవితి విషయంలో ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందించి గణేశ్ మండపాలపై అధికారిక సమావేశం ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో మొహరం పండుగకు సంబంధించి ముందస్తు అనుమతులు ఇచ్చారని, కానీ వినాయక చవితి విషయంలో ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విష్ణు ప్రశ్నించారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాదా అని అడిగారు.
హిందూ సమాజం అన్ని విషయాలు గమనిస్తోందని, సరైన సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని విష్ణు వ్యాఖ్యానించారు. కరోనా కేసుల నేపథ్యంలో గణేశ్ మండపాలపై నిషేధం విధించిన ఇరు తెలుగు ప్రభుత్వాలు ఇళ్ల వద్దే పండుగ జరుపుకోవాలని సూచన చేశాయి.