అమిత్ షా కాన్వాయ్పై దాడి, బాబు వైపు బీజేపీ వేళ్లు: ఇదీ జరిగింది.. ఏమైందో చెప్పిన ఎమ్మెల్యే
హైదరాబాద్/అమరావతి: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్పై తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీ, తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడి తీవ్రమైన అంశమని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు.
టీడీపీలో గూండాలు-తరిమి కొడతారు: ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన 'అమిత్ షా'పై దాడి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిసే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. అమరావతి కుట్రలో భాగంగా తిరుపతిలో దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడి నేపథ్యంలో అమిత్ షాకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ కూడా టీడీపీపై నిప్పులు చెరిగారు.
అందుకే అమిత్ షా కాన్వాయ్పై దాడి
బీజేపీ వరుస విజయాలు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వారు ఈ దాడి చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ దాడి నేపథ్యంలో ఏరియా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. ఇలాంటి దాడుల కారణంగా టీడీపీ చరిత్ర హీనమవుతోందని హెచ్చరించారు. బీజేపీ విజయబావుటా ఏపీకి పాకుతుందనే భయంతో టీడీపీ ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు.
మీరు వాహనాలపై దాడి చేసే రౌడీలా?
ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకున్నామని ఏపీ బీజేపీ నేత కోలా ఆనంద్ అన్నారు. దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే వాళ్ల లేక వాహనాలపై దాడి చేసే రౌడీలా అని టీడీపీపై నిప్పులు చెరిగారు.
పక్కదారి పట్టించే దుష్ప్రచారం
తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటనపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. నిరసనను దాడిలా చూడటం సరికాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్న ఆవేదన, ఆవేశం ప్రజల్లో ఉన్నాయన్నారు. హోదా ఇవ్వని బీజేపీని వ్యతిరేకించడం సహజమేనని, ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ఏం జరిగిందో చెప్పిన ఎమ్మెల్యే
మరోవైపు, అమిత్ షాపై దాడి నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. దీని నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దాడిపై తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ స్పందిస్తూ.. టీడీపీ కార్యకర్తలు కేవలం నల్ల జెండాలతో నిరసన మాత్రమే తెలిపారన్నారు. ఆ సమయంలోనే అమిత్ షా కాన్వాయ్ వెళ్లిపోయిందన్నారు. కాన్వాయ్ వెళ్లగానే బీజేపీ నేతలు వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. కావాలంటే సీసీ ఫుటేజీలు చూసుకోవచ్చన్నారు. శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ నేత కోలా ఆనంద్ అనుచరులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని, జెండా కర్రలతో కొట్టారని చెప్పారు. బీజేపీ నేతల కారణంగా తమ పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.