జగన్ తో భేటీ అయిన బీజేపీ నేత జీవీఎల్ .. అందుకు కాదట
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏతో జతకడితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా రంగంలోకి దిగి డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు కూడా సమాచారం అందించారు. ఇదే సమయంలో ఏపీ లోని బిజెపి నేత జీవీఎల్ నరసింహారావు జగన్ తో భేటీ అవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం గా మారింది.
జగన్ తో బీజేపీ నేత జీవీఎల్ భేటీ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కలిశారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన జగన్ తో సమావేశమయ్యారు. అయితే అందరూ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వాలన్న నేపథ్యంలోనే ఎన్డీఏతో భాగస్వామ్యంపై చర్చల్లో భాగంగా జీవీఎల్ సమావేశమైనట్లు గా అందరూ భావించారు. కానీ జీవీఎల్ తనకా విషయమే తెలియదు అని పేర్కొన్నారు.
Recommended Video
వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఇచ్చే విషయమే తనకు తెలీదన్న జీవీఎల్ ..
జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జివిఎల్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని పేర్కొన్నారు. ఇక లోక్ సభ ఉప సభాపతి పదవి ఎవరికి ఇస్తారో అది తన పరిధిలోని కాదని, బిజెపి అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తామనే విషయమే తనకు తెలియదని జీవీఎల్ చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా జగన్ ను కలిశానని పేర్కొన్న జీవీఎల్ నరసింహారావు ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అభినందనలు చెప్పానని పేర్కొన్నారు.
టీడీపీ నాయకులను చేర్చుకోవటంపై పార్టీలో అంతర్గత చర్చ తర్వాత నిర్ణయం
అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపై జగన్ తో మాట్లాడానని జీవీఎల్ తెలిపారు. ఇక బీజేపీలోకి ఇటీవల జనసేన నుండి రావెల కిషోర్ బాబు చేరిన నేపధ్యంలో బీజేపీలోకి వచ్చే వారందరికీ స్వాగతం అని తెలిపిన జివిఎల్ టిడిపి రాష్ట్ర స్థాయి నాయకులను చేర్చుకునే విషయంలో మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఏపీ గవర్నర్ గా సుష్మాస్వరాజ్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మొత్తానికి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన జివిఎల్ జగన్ తో భేటీ లో పలు కీలక అంశాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోని వైసిపి ప్రభుత్వానికి బిజెపి తన మద్దతును అందించబోతున్న సంకేతాలు తాజా పరిణామాల నేపథ్యంలో అర్థం అవుతున్నాయి.