బాబుకు ఝలక్: '19లో బీజేపీకి ఛాన్స్ అని కృష్ణంరాజు
హైదరాబాద్: 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇది చర్చనీయాంశమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సొంతగా అధికారంలోకి రావొచ్చునని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి నడుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే, ఎన్నికలకు ముందు, తర్వాత బీజేపీలో చేరేందుకు ఏపీలోని పలువురు విపక్ష నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువమంది బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు తరుచూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలె కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఆయన దారిలోనే మరికొందరు ఉంటారని చెబుతున్నారు. 2019 నాటికి ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా పలువురు కమల తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే, అధికారంలో మిత్రపక్షం టీడీపీ ఉండటంతో ఇది చర్చనీయాంశమవుతోంది.
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీల బంధం పాతికేళ్లది. అయినప్పటికీ బీజేపీ తెంచుకున్న విషయం తెలిసిందే.
సోమవారం కృష్ణంరాజు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ బిజెపిలో చేరితే మంచిదని అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. రాజకీయాల పట్ల రజనీకాంత్ వైఖరి కాస్తా మారిందని, గతంలో రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉన్న రజనీకాంత్ ఇప్పుడు భగవంతుడు ఆదేశిస్తే వస్తానని అంటున్నారని ఆయన గుర్తు చేశారు.
రజనీకాంత్ చేరితే తమిళనాడులోనే కాకుండా దక్షణ భారతదేశంలో బిజెపి బలపడుతుందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహ కల్ప సమీపంలో ఆయన సతీసమేతంగా రోడ్లు ఊడ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
కాగా, అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా పని చేశారు. అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాక ఆ పార్టీలో చేరారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక.. కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.