మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టండి... తిరుమల వ్యాఖ్యలపై బీజేపీ... ఫిర్యాదు
మంత్రి కొడాలి నాని తిరుమల ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ సంధర్భంగా అన్యమతస్తులు ఎవరు వెళ్లాలన్న డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
నానికి చుట్టుకున్న తిరుమల వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే... ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే సందర్భంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల దర్శనంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయాన్ని ఎవడి అమ్మమొగుడు నిర్మించాడని ఆయన తీవ్రమైన పదజాలంతో ప్రతిపక్ష టీడీపీ నాయకులను విమర్శించారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టె విధంగా వ్యవహరించిన మంత్రి నాని వ్యాఖ్యలు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి.
మంత్రి వ్యాఖ్యలపై పార్టీలు, ఆధ్యాత్మిక సంఘాల ఫైర్
కాగా మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు, పలు ఆధ్యాత్మిక సంఘాలు కూడ విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, బాలాజీ భక్త బృందంతో పాటు ఇతర సంఘాలు పలు విమర్శలు చేశాయి. భక్తుల విశ్వాశాలు, తిరుమల నియామావళితోపాటు, సాంప్రదాయాలపై సైతం మంత్రి నీచంగా మాట్లాడని వారు మండిపడ్డారు. టీటీడీ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం కాదని ... స్వయం ప్రతిపత్తి గల్గిన దేవాలయమని వివరించారు. స్యయంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం తోపాటు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలు సైతం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించే వారని గుర్తు చేశారు.
Recommended Video
నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ
ఇక తాజాగా బీజేపీ నేతలు మంత్రి చేసిన వ్యాఖ్యలపై నేరుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర మతాల గౌరవాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వర్గంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం భాద్యత తీసుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఇక అన్యమతస్తులు ఎవరు ఆలయాన్ని సందర్శించాలన్న డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే మూడు రోజులుగా నాని చేసిన వ్యాఖ్యలుపై దుమారం రేగుతున్నా..వాటిపై ఎలాంటీ వివరణ ఇచ్చేందుకు మంత్రి ముందుకు రాలేదు. తాజాగా బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీసుకుంటారా.... కనీసం మంత్రైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.