ఏపీ నుండి కేంద్రమంత్రి ఎవరో తేలిపోయింది: ఆయనే వైపే మొగ్గు: ముహూర్తం ఫిక్స్..!
వరుసగా రెండో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ తన కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం చేస్తున్నారు. అందు కోసం దాదాపు ముహూర్తం సైతం ఖరారైంది. మోదీ ప్రస్తుత కేబినెట్ లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి ఉండగా..ఏపీ నుండి మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఏపీలో బలపడాలని అడుగులు వేస్తున్న బీజేపీ ఈ సారి ఏపీ నుండి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. కేంద్రంలో మంత్రిగా ఏపీ నుండి ఎవరికి దక్కుతుందనే అంశం పైన కొద్ది రోజల క్రితం పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాతో పాటుగా జీవీఎల్ నరసింహారావు పేరు పైన చర్చ సాగింది. వీరితో పాటుగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ, బీజేపీ అధినాయకత్వం మాత్రం దీని పైన స్పందించలేదు. ఇప్పుడు కేబినెట్ విస్తరణలో ఏపీకి ప్రాతినిధ్యం ఖాయమని సంకేతాలిస్తున్నారు. అదే సమయంలో ఎవరికి ఇచ్చేదీ సూచన ప్రాయంగా పార్టీ నేతలతో షేర్ చేసుకున్నారు. ఇందుకు ముహూర్తం సైతం ఖరారు చేసారు.
బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు: టీడీపీనే కాదు జనసేన నేతలు: వైసీసీ మాజీ ఎమ్మెల్యే సైతం..!
కేంద్రమంత్రి రేసులో ఏపీ నేతలు..
ప్రధాని మోదీ మహారాష్ట్ర..హర్యానా ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. దీపావళి గిఫ్ట్ గా ఏపీ నుండి కేంద్ర మంత్రి వర్గంలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో రెండో సారి మోదీ అధికార పగ్గాలు చేపట్టిన నుండి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కోసం ఏపీ బీజేపీ నేతలు నిరీక్షిస్తున్నారు. తెలంగాణ నుండి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..ఏపీ అధికారిక వ్యవహారాలపైనా ఫోకస్ చేయాలని సూచించింది. దీంతో..ఎప్పడు కేబినెట్ విస్తరణ జరిగినా అధినాయకత్వం మదిలో ఉండే ఏపీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తో పాటుగా టీడీపీ నుండి బీజీపీలో చేరిన సుజనా చౌదరి..సీఎం రమేష్ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే..వీరిలో ఎవరికి ఇవ్వటం ద్వారా ఏపీలో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే అంశం పైన అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి.
అమిత్ షా మదిలో ఇద్దరి పేర్లు..
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ బీజేపీ నేతల నుండి అందుతున్న సమాచారం మేరకు ఏపీ నుండి ఇద్దరి పేర్లను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మదిలో ఉన్నారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేష్ ప్రభుకు అవకాశం ఇవ్వటం ద్వారా ఏపికి ప్రాతినిధ్యం కల్పించటంతో పాటుగా ప్రభుత్వలో సమర్ధవంతమైన మంత్రిగా ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి చెందిన రాం మాధవ్ పేరును తొలి ప్రాధాన్యతగా అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎలాగైనా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాం మాధవ్ సమర్ధుడుగా గుర్తించి..ఆయనకు ఏపీ కోటాలో కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. బీజేపీ ముఖ్యులు మాత్రం రాం మాధవ్ కు ఏపి కోటాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు.
టీడీపీ నుండి వచ్చిన వారికి నో ఛాన్స్..
ఇక, టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా చౌదరికి ఇవ్వటం ద్వారా టీడీపీ నేతలను పూర్తిగా బీజేపీలోకి తీసుకొచ్చి..టీడీపీని దాదాపుగా నిర్వీర్యం చేయవచ్చే ఆలోచనతో బీజేపీ ఉందనే వాదన వినిపించింది. అయితే.. సామాజిక వర్గాల పరంగా సజనా చౌదరికి అవకాశం ఇస్తే పార్టీలోని నేతలు.. కింది స్థాయి కేడర్ అంగీకరించరని రాష్ట్ర నేతలు నివేదించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబుకు అనుకూలురనే ముద్ర బలంగా వినిపిస్తోంది. దీని ద్వారా ఆ నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ దాదాపు లేనట్లుగా సమాచారం.
రాం మాధవ్ కే ఛాన్స్.. ముహూర్తం ఫిక్స్..
దీంతో..దీపావళికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమని తెలుస్తోంది. రాం మాధవ్ ఏపీకి చెందిన వ్యక్తి అయినా ఆరెస్సెస్..బీజేపీలో కీలకంగా పని చేస్తున్నారు. ఆయన గతంలో జమ్ము కాశ్మీర్ తో పాటుగా గత ఏడాది త్రిపురలో బీజేపీ విజయం కోసం పని చేసి సక్సెస్ అయ్యారు. మోదీ..అమిత్ షా టీంలో కీలకంగా ఉన్న రాం మాధవ్ కు ఏపీ నుండి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వటం ద్వారా ఏపీ..తెలంగాణలో పార్టీ బలోపేతం..వ్యూహాల అమలు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మోదీ కేబినెట్ లో 58 మంది మంత్రులు ఉండగా..అందులో 24 మంది కేబినెట్ హోదాలో ఉన్నారు. మరో పది మంది వరకు అవకాశం ఉంది. దీంతో..సురేష్ ప్రభుతో పాటుగా ఏపీ కోటాలో రాం మాధవ్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.