సంచైత వ్యవహారంలో మరో ట్విస్ట్- వడ్డించే వాడు మనోడైతే ఇక అన్నీ...!
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుకు ఛైర్ పర్సన్ గా వైసీపీ ప్రభుత్వం నియమించిన సంచైత గజపతిరాజును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ నేతలకు నిరాశ తప్పేలా లేదు. మాన్సాస్ వ్యవహారంలో ఉన్న సంక్షిష్టత, ఇప్పటికే దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తుండటం, బీజేపీ పెద్దలతో సంచైతకు ఉన్న సాన్నిహిత్యం వంటి అంశాల నేపథ్యం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఇది సంచైతకు భారీ ఊరట కానుంది. దీంతో ఇక సంచైత వ్యవహారం కోర్టుల్లోనే తేలాల్సి ఉంది.
Recommended Video
మాన్సాస్ ఛైర్ పర్సన్ పదవి
విజయనగరం జిల్లాల్లో పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు బాధ్యతలను రాత్రికి రాత్రే వైసీపీ సర్కారు కేంద్ర మాజీ మంత్రి, ఇప్పటివరకూ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు నుంచి తొలగించి ఆయన అన్న ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైతకు కట్టబెట్టింది. దీనిపై విపక్ష టీడీపీ నుంచి విమర్శలు ఊహించినవే అయినా అనూహ్యంగా సంచైత సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. బీజేపీ బాటలోనే విశ్వహిందూ పరిషత్ కూడా సంచైత నియామకం వైసీపీ కన్నుసన్నల్లోనే జరిగిందని, హిందూ దేవాలయాలపై ఆధిపత్యం కోసమే జగన్ ఈ నియామకం చేశారని మండిపడుతోంది. దీనిపై ఇప్పటికే మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు పలు అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ బీజేపీ ఫిర్యాదులు
తమ పార్టీ యువజన విభాగం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న సంచైతకు మాన్సాస్ ఛైర్మన్ పదవిని కట్టబెడితే సంతోషించాల్సిన ఏపీ బీజేపీ నేతలు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. సంచైతను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయ చదరంగం మొదలుపెట్టిందని బీజేపీ స్ధానిక నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, త్వరలో సంచైతను పార్టీ నుంచి తప్పించడం ఖాయమని ఇప్పటివరకూ లీకులు ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు తాము తప్పుకుని విశ్వహిందూ పరిషత్ ను రంగంలోకి దింపడం వెనుక పెద్ద కథే నడిచిందని చెబుతున్నారు.
బీజేపీ పెద్దలతో సంచైత....
హైదరాబాద్ లో పుట్టి ఢిల్లీలోనే చదువుకున్న సంచైతకు అక్కడ సర్కిల్స్ చాలా ఎక్కువ. వారి సాయంతోనే తొలుత బీజేపీ పెద్దలకు దగ్గరైన సంచైత.. ఆ తర్వాత బీజేవైఎంలో చోటు సంపాదించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, బీజేపీని తన కన్నుసన్నల్లో నడుపుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ హైకమాండ్ పెద్దలతో సంచైత టచ్ లో ఉంది. వారి సూచనల మేరకే సంచైతకు మాన్సాస్ పదవి దక్కిందనే ప్రచారం కూడా ఉంది. ఈ వ్యవహారం అంతా స్ధానికంగా ఉన్న ఏపీ బీజేపీ నేతలకు అంతగా తెలియదు. దీంతో ఎప్పటిలాగే తమకు తెలియకుండానే తమ పార్టీ నేతకు మాన్సాస్ వంటి కీలక పదవిని వైసీపీ ఎలా కట్టబెడుతుందనే వాదనను వీరు తెరపైకి తెచ్చారు.
జోక్యానికి ముందుకు రాని బీజేపీ పెద్దలు..
తమ పార్టీకి చెందిన సంచైతను తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే రహస్య జీవోలు తీసుకొచ్చి మరీ మాన్సాస్ పదవిలో కూర్చోబెట్టడాన్ని ఏపీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో సంచైత కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాన్సాస్, సింహాచలం ట్రస్టుల బాధ్యతలు చేపట్టడాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమెను తక్షణం క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ హైకమాండ్ కు లేఖ రాశారు. కానీ బీజేపీ పెద్దలతో ఆమెకున్న పరిచయాలు, బీజేవైఎం నేతలతో సత్సంబంధాలు, మాన్సాన్ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టత, ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరిన నేపథ్యం వంటి కారణాలతో సంచైత వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు వారు ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది.