నేనొస్తున్నా!: రంగంలోకి రామ్ మాధవ్, బాబుకు చెక్ పెట్టేనా? నేరుగా అధికారంలోకి రాకున్నా...
అమరావతి/హైదరాబాద్: జమ్ము కాశ్మీర్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర, ఆ పార్టీ ముఖ్య నేత రామ్ మాధవ్ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా టీడీపీతో దోస్తీ చెడిన అనంతరం ఆంధ్రప్రదేశ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది.
బీజేపీ వల్లే గెలిచావ్.. ఇదీ లెక్క, ఓటుకు నోటు నుంచి ఎస్కేప్, మీరే కారణం: బాబుపై ఉండవల్లి
బీజేపీ ప్రస్తుతం దక్షిణాదిపై దృష్టి సారించింది. కర్నాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉంది. అయినా కర్నాటక విషయంలో బీజేపీ పట్టుదలతో ఉంది. లింగాయత్ల అంశం కాంగ్రెస్కు కలిసి వస్తోంది. ఇది బీజేపీని కార్నర్ చేసిందని చెప్పవచ్చు.
దక్షిణాదిపై రామ్ మాధవ్ దృష్టి
ఈ విషయాన్ని పక్కన పెడితే, రామ్ మాధవ్ త్వరలో దక్షిణాది... ముఖ్యంగా ఏపీపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటుగా స్పందించాలని, వారి విమర్శలను అంతేస్థాయిలో తిప్పికొట్టాలని సూచిస్తున్నారు. త్వరలో ఆయన నేరుగా రంగంలోకి దిగే అవకాశముంది.
చంద్రబాబుపై పైచేయి సాధిస్తారా?
దీంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్.. చంద్రబాబుపై పైచేయి సాధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం బలం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 నాటికి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగడంపై కూడా ఆయన దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
నేను వస్తా.. త్వరలో అన్నీ సర్దుకుంటాయి
ఇటీవల తనను కలిసిన బీజేపీ నేతలకు రామ్ మాధవ్ ధైర్యం నూరిపోశారు. ప్రత్యేక హోదా వంటి అంశాల్లో అన్ని పార్టీలు బీజేపీనే వేలెత్తి చూపడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే తాను రాష్ట్రానికి వస్తానని, అన్ని సర్దుకుంటాయని హామీ ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.
లెక్కలన్నీ బయటకు వస్తాయి
రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాక పరిస్థితులను ఏపీ బీజేపీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన దృష్టికి నేతలు తీసుకు వెళ్తున్నారు. అయితే ఏపీ అభివృద్ధి విషయంలో క్రమంగా లెక్కలు అన్నీ బయటకు వస్తాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారని తెలుస్తోంది.
సొంతగా అధికారంలోకి రాకపోవచ్చు కానీ
త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చనున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కంభంపాటి హరిబాబు స్థానంలో మరొకరు రానున్నారు. 2019 ఎన్నికల కోసం కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని ఇప్పటికే బీజేపీ నేతలు భావిస్తున్నారు. అది ఎవరు అనేది ముందు ముందు తేల్చనున్నారు. ఏపీలో బీజేపీ నేరుగా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఇతర పార్టీలతో కలిసి వస్తామని ఏపీ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్ మాధవ్ వస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా అవుతాయని బీజేపీ నేతలు కూడా కొందరు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పొత్తు కోసం ఆయన కొత్త వారిని వెతుకుతారని అంటున్నారు.