కేంద్రాన్ని నడపటం బిజెపికి సాధ్యంకాకపోతే ఏపీ ప్రభుత్వానికి ఇవ్వండి: ఎమ్మెల్యే ఐతాబత్తుల
అమరావతి:కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి సాధ్యం కాకపోతే, కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వ్యాఖ్యనించారు.
సోమవారం ఆయన అమరావతి శాసనసభా ప్రాంగణంలోని మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేస్తూ, దుర్మార్గపు పాలన చేస్తోందని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆరోపించారు. ఏపీ బీజేపీ నేతలు చేతనైతే నిధుల కోసం ప్రధాని మోడీని నిలదీయాలని, చేతకాకుంటే ఊరుకోవాలే తప్ప కష్టపడే సీఎం చంద్రబాబుపై నిందలు వేయడం తగదని ఆయన హితవు పలికారు.
బీజేపీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడలేకపోతుందని, కేంద్ర ప్రభుత్వాన్ని నడపలేకపోతే...కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్యే ఐతాబత్తుల సూచించారు. తాము అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు పంపకాలు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ బిజేపీ నేతలు కళ్లుండీ చూడలేని కబోదుల్లా మారారని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు అమరావతి రోడ్ల నిర్మాణాలు బీజేపీ నేతలకు కన్పించడం లేదని దుయ్యబట్టారు. కేసుల భయంతోనే మోడీకి జగన్ దాసోహం అంటున్నారని ఆయన విమర్శించారు.
టిడిపి మరో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు పెట్రోల్ ధరలు మరింత భారం కాకుండా లీటరుకు రూ.2 చొప్పున తగ్గించి, సీఎం చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని బచ్చుల అర్జునుడు కొనియాడారు. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కేంద్రం...వాటి రేట్లు తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఇదిలావుంటే అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్రాన్ని పాలించడం టీడీపీకి చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలన్న బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్ గానే అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని మాట్లాడినట్లు తెలుస్తోంది. బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ ఎపి టిడిపి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
రాజధాని పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములతో టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద గత నాలుగేళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన రూ.32 వేల కోట్లను మట్టి తవ్వకాల పేరుతో టీడీపీ నేతలు మింగేశారని ఆయన ఆరోపించారు. రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇస్తే, నీరు కారే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టి నిధులు జుర్రుకు తిన్నారని అన్నారు. శాసనసభ అబద్ధాల నిలయంగా మారిందన్నారు. రాష్ట్రాన్ని పాలించడం టీడీపీకి చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.