ప్రత్యేక హోదాకు బీజేపీ జై కొట్టనుందా..? జగన్ మద్దతు కోసం కమలదళం కొత్త స్కెచ్..?
కేంద్రంలో మద్దతు కోసం బిజెపి జగన్ కు గాలం వేస్తుందా? ప్రత్యేక హోదా ఇస్తామని ఫీలర్లు పంపిస్తుందా? అంటే అవును అని చెప్పక తప్పదు . కేంద్రంలో హంగ్ లోక్ సభ వచ్చే అంచనాలతో ఉన్న బిజెపి, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీయేతర కూటమి ద్వారా కాంగ్రెస్ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, అటు బిజెపి సైతం ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
కేంద్రంలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అని భావిస్తున్న బీజేపీ ఎన్డీఏకు వెలుపల ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏపీ లోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ పై దృష్టి సారించింది. ఇప్పటికే ఏపీ లో ఉన్న 25 లోక్ సభ సీట్లలో 20 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి జగన్ పార్టీ కీలకమవుతుందని భావిస్తున్నారు బిజెపి నాయకులు.
బీజేపీ ప్రత్యేక హోదాకు మొగ్గు చూపితే జగన్ మద్దతిచ్చే అవకాశం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన జగన్ పార్లమెంట్లో ఎంపీలను ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికి తన మద్దతు ప్రకటిస్తామని చెప్పారు జగన్. ఇక ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలలో వైసిపి అత్యధిక స్థానాలు సంపాదిస్తే వైసిపి మద్దతును పొందే క్రమంలో బిజెపి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వైసీపీ మద్దతు పొందే అవకాశం ఉంది.
ఒక పక్క చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేస్తూ ప్రత్యేక హోదా సాధించలేక ఎన్డీఏతో స్నేహసంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపి ప్రత్యేక హోదాకు మొగ్గుచూపితే అది చంద్రబాబు ను మరింత దెబ్బ కొట్టడానికి అవకాశంగా మారుతుంది.జగన్ కు కలిసొచ్చే అంశంగా మారుతుంది.
ఎన్నికల ఫలితాల తర్వాతే జగన్ నిర్ణయం .. అప్పుడు పరిస్థితిని బట్టి వ్యూహం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించిన చంద్రబాబు విఫలమయ్యారని, ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ సఫలమయ్యారనే భావన ప్రజల్లో వస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అటు బిజెపి, ఇటు వైసీపీ రెండూ చంద్రబాబు ని దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయినట్టే. ఇక ఈ నేపద్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి, అప్పుడు ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే బిజెపి ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ మద్దతు ఇచ్చే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రంలో హంగ్ వస్తే మద్దతు అనివార్యమైతే బిజెపి సైతం ప్రత్యేకహోదా అంశంపై తలొగ్గే అవకాశముంది.