చంద్రబాబు పాపాలలో బీజేపీ, జనసేనకు వాటా లేదా ? అంతర్వేది ఘటన.. ప్రతిపక్షాలపై మంత్రి వెల్లంపల్లి ఫైర్
అంతర్వేది రథం దగ్ధం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన మత ఘర్షణలకు కారణమవుతోంది. తాజా పరిణామాలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్వేది రథం కాల్చివేత ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రథాన్ని తగలబెట్టిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 95 లక్షల రూపాయలతో కొత్త రథం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డీజీపీని కూడా ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
అంతర్వేది ఘటనపై కమిటీ వేసిన చంద్రబాబు స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఈగ వాలకుండా కాపాడారు :విజయసాయి ఫైర్
సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
అంతర్వేది ఘటన తర్వాత విమర్శలు , పరిణామాల నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సోము వీర్రాజును,జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయలేదని ఆయన పేర్కొన్నారు. హౌస్ అరెస్టు చేస్తే అంతర్వేదికి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. మత రాజకీయాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. పనికిమాలిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అంటూ ఫైర్ అయ్యారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
మతాలమధ్య చిచ్చు పెట్టే పనిలో చంద్రబాబు
అంతర్వేది ఘటనలో ఆలయ ఈవో ని సస్పెండ్ చేశామని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఒక దయ్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం దేవస్థానం లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపామని, 30 మంది అవినీతి అధికారులు తొలగించామని పేర్కొన్నారు. హైదరాబాద్లో కూర్చొని జూమ్ లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, దాడులు చేసే సంస్కృతి చంద్రబాబుదేనని మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు.
నాడు దేవాలయాల కూల్చివేతల్లో బీజేపీ, జనసేనలకు భాగస్వామ్యం లేదా ?
చంద్రబాబు హయాంలో పుష్కరాల సందర్భంగా 40 దేవాలయాలను కూల్చి వేశారని,ఆ కూల్చివేతలో బీజేపీ, జనసేనలకు భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నించారు మంత్రి వెల్లంపల్లి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దు అంటూ మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి. విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చ్ పై రాళ్ళు రువ్వారని , దేవాలయాలు, మసీదులు ,చర్చిలు జోలికి వస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు .
ఫామ్ హౌస్ లో కూర్చుని పవన్ విమర్శలు చేస్తే సరిపోతుందా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు మంత్రి వెల్లంపల్లి. పవన్ కళ్యాణ్ లాగా ఓట్ల కోసం రాజకీయాలు చేయటం మాకు తెలీదు అంటూ వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ లో కూర్చుని పవన్ విమర్శలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు . ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టియన్ అన్నారని, ఎన్నికల తర్వాత హిందువులు అంటున్నారని పేర్కొన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల పోటీ చేస్తే ఓడించారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాపాలలో బీజేపీకి జనసేనకు వాటా లేదా అంటూ ప్రశ్నించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.