రేపు ఏపీలో బీజేపీ-జనసేన నిరసనలు... చాలా కాలం తర్వాత ఉమ్మడిగా..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న గృహనిర్మాణ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో కలిసి రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించాలని జనసేన నేతలకు పవన్ పిలుపునిచ్చారు. ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్పరెన్స్ లో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు.
గృహనిర్మాణంతో పాటు కరోనా కష్టాలు, ఇళ్ల కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై పవన్ జనసేన నేతలతో చర్చించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని, అందుకు తగ్గ స్ధాయిలో ప్రభుత్వ చర్యలు లేవని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ పార్టీ నేతలతో తెలిపారు. అందుకే నిరసనలు చేపట్టాలని వారికి సూచించారు.
గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అడపాదడపా మాత్రమే ఆ పార్టీతో కలిసి ఉమ్మడి నిరసనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ.. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ నిరసనల్లో ఇరు పార్టీల నేతలు మాత్రమే పాల్గొంటారని, పవన్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.