మెగా బ్రదర్స్కు బీజేపీ బంపరాఫర్: అన్నయ్య కాదంటే తమ్ముడితో: జగన్కు చెక్ పెట్టాలంటే..!
Recommended Video
బీజేపీ అధినాకయత్వం మెగా స్కెచ్ వేస్తోంది. టీడీపీని మాత్రమే కాదు..ఏపీ రాజకీయ పార్టీలనే టార్గెట్ చేస్తోంది. ఏపీ లో తమ పార్టీకి భవిష్యత్ ఇచ్చే నేతల కోసం వెంపర్లాడుతోంది. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉండీ..తాజా ఎన్నికల్లో ఓడిన తెలుగుదేశం తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో మిషన్ 2024లో భాగంగా..ఏపీలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ప్రజాకర్షక నేతలను తమ వైపు తిప్పుకోవటానికి కీలక వ్యక్తులను రంగంలోకి దించింది. అందులో మెగా బ్రదర్స్ వైపు బీజేపీ దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు టీడీపీని ఖాళీ చేసే పని ప్రారంభించినా భవిష్యత్లో జగన్తో ప్రజా కర్షణలో పోటీ పడే నేతను ఎంచుకోవటమే వారి వ్యూహంగా స్పష్టమవుతోంది.
మెగాస్టార్కు బీజేపీ బంపరాఫర్..
బీజేపీ అధినాయకత్వం ఏపీ పైన దృష్టి సారించింది. అందులో భాగంగా..తొలుత ఎన్నికల్లో ఓడి డీలా పడిన టీడీపీ నేతలను తమ వైపు లాగేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో బీజేపీలోకి రావటానికి పలువురు ముందుకు వస్తున్నా..వారికి బిజేపీ భవిష్యత్ మీద సందేహాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు తమ ప్రణాళికలు బీజేపీ నేతలు వివరిస్తున్నారు. అందులో భాగంగా..టీడీపీలోని ప్రముఖులను తమ పార్టీలోకి తీసుకోవటం.. కింది స్థాయి టీడీపీ శ్రేణులు సైతం బీజేపీలో చేరేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజాకర్షణ ఉన్న నేతకు బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించాలని..అందునా..అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని సూచించాలని అధినాయకత్వం ఏపీ నేతలకు సూచించగా..అందులో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పేరు చర్చకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా చిరంజీవి వ్యవహారాలు పర్యవేక్షించే ముఖ్య వ్యక్తితో సంప్రదింపులు ప్రారంభించారు. చిరంజీవి బీజేపీలోకి రావటానికి అంగీకరిస్తే..ఆయనకు రాజ్యసభ పదవితో పాటుగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి అప్పగిస్తామని ఆఫర్ చేసారు.
చిరు కాదంటే..పవన్ వైపు..
చిరంజీవి వ్యవహారాలను చూస్తూ..ఆయన చెబితే చిరంజీవి చెప్పినట్లుగా భావించే ముఖ్యమైన వ్యక్తితో బీజేపీ నేతలు ఇప్పటికే ఒక దఫా మంతనాలు పూర్తి చేసారు. చిరంజీవి సుముఖంగా ఉంటే వారే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేందు కు సిద్దమని స్పష్టం చేసారు. చిరంజీవి కాంగ్రెస్లో నామ్కే వాస్తే ఉంటున్నారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ సినిమా షూటింగ్కు పరిమితం అయ్యారు. అయితే, ఆయనకు ఉన్న ఛరిష్మా మాత్రం తగ్గలేదన్నది బీజేపీ నేతల అంచనా. అందునా ఏపీలో సామాజిక వర్గాల బలాబలాల ఆధారంగా చిరంజీవి సరైన వ్యక్తిగా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి అంగీకరించకపోతే..పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకూ బీజేపీ నేతలు సిద్దంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్కు ప్రజాకర్షణ ఉన్నా..రాజకీయంగా అనుభవం లేకపోవటం..ఆర్దిక-పొలిటికల్ మేనేజ్మెంట్లో వెనుకబడటంతో ఆయన్న ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయారు. దీంతో..గతంలో అమిత్ షా స్వయంగా పవన్తో బీజేపీలో జనసేన విలీనం చేసి..బీజేపీ బాధ్యతలు తీసుకోవాలని కోరగా..పవన్ అంగీకరించలేదు. ఇక, ఇప్పుడు ఎన్నికల తరువాత పరిస్థితులు మారటంతో..బీజేపీ పవన్ ను సైతం తమకు ఆప్షన్గా చూస్తోంది. మరి పవన్ అందుకు అంగీకరిస్తారా అంటే..అది సందేహమే.
జగన్కు చెక్ పెట్టాలంటే..
ప్రస్తుతం ఏపీలో టీడీపీని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ..ఇక్కడ తాము నిలదొక్కుకోవాలంటే జగన్కు ధీటుగా రాజకీయం చేయాల్సిందేననే అభిప్రాయానికి వచ్చారు. జగన్ ప్రస్తుతం తమతో సఖ్యతగా ఉంటున్న సమయంలో ఆయనతో తాము కూడా సన్నిహితంగానే ఉండాలని భావిస్తున్నారు. కానీ, ఎన్నికల సమయానికి పార్టీ బలోపేతం కావాలంటే.. టీడీపీ డీలా పడిని ప్రస్తుత సమయమే సరైనదని బీజేపీ నేతలు అంచనాకు వచ్చారు. దీంతో..ఒక వైపు జగన్ తో సఖ్యతగా ఉంటూనే..మరో వైపు జగన్తో ప్రజాకర్షణలో పోటీ పడే నేత కోసం అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా వారికి మెగా బ్రదర్స్ మాత్రమే ప్రత్యామ్నయంగా ఉన్నారు. ఇందులో చిరంజీవి 2009లో వైయస్ ఛరిష్మా ముందు చిరంజీవి.. 2019లో జగన్ ప్రజాకర్షణ ముందు పవన్ నిలవలేక పోయారు. అయితే, ఒకే వ్యక్తి మీద ఎంతో కాలం ప్రజాదరణ ఇదే స్థాయిలో ఉండదని..అందునా ప్రభుత్వంలో ఉన్న సమయంలో దానిని నిలబెట్టుకోవటం అంత సులువు కాదనేది బీజేపీ నేతల విశ్లేషణ. దీంతో..బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు మరి కొద్ది రోజుల్లోనూ పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.