జడ్జిలపై ఫిర్యాదు: జగన్కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడా
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై దుమారం పెద్దదవుతోంది. ఏపీ సీఎం లేఖ రాసి పది రోజులు కావొస్తున్నా ఈ వ్యవహారంపై ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పందించాల్సి ఉండగా, పలువురు న్యాయనిపుణులు, లాయర్లు, రిటైర్డ్ జడ్జిలు జగన్ తీరును బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు అడ్వొకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ సైతం జగన్ కు వ్యతిరేకంగా సీజేఐకి లేఖ రాయడం షాకింగ్ పరిణామంగా మారింది.
జస్టిస్
ఎన్వీ
రమణపై
9ఏళ్లుగా
ఇలానే
-
జగన్
కుట్రలకు
ఆధారాలివే
-
ఎంపీ
రఘురామ
తాజా
బాంబు
అశ్విని సంచలన వ్యాఖ్యలు..
ఏపీ సీఎం జగన్ ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోజే, సీజేఐ బోబ్డేను సంప్రదించి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించడంతో.. జగన్ చర్యకు కేంద్ర పెద్దల ఆమోదం ఉందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ అంశంపై బీజేపీ నేతలెవరూ కామెంట్లు చేయకపోవడం సదరు ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది. కానీ బీజేపీకే చెందిన కీలక నేత, సుప్రీంకోర్టు అడ్వొకేట్ అశ్వని కుమార్ ఉపాధ్యాయ గురువారం సీజేఐకి రాసిన లేఖలో జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ అధికార ప్రతినిధిగానూ అశ్వని వ్యవహరించారు. కాగా, సీజేఐకి అశ్వని లేఖ వ్యక్తిగత స్థాయిలోనే రాసినప్పటికీ, దానికి పార్టీ అనుమతి కూడా ఉందా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
జగన్ నేరాలకు 30 ఏళ్ల శిక్ష..
అవినీతి కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల విషయంలో జస్టిస్ ఎన్వీ రమణ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్న తీర్పు నేపథ్యంలోనూ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంగా ఉండి ఉండొచ్చని అడ్వొకేట్ అశ్విని కుమార్ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం జగన్, ఆయన సహచరులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, అవి కోర్టుల్లో నిరూపితమైతే కనీసం 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జగన్పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే న్యాయమూర్తుల ప్రస్తుత లేఖ ప్రభావం పడే అవకాశం ఉందని, జగన్ చర్య న్యాయవ్యవస్థపై బెదిరింపులకు దిగినట్లుగానే పరిగణించాలని అశ్విని కుమార్ అన్నారు.
ఫుల్ కోర్టుతో విచారించాలి..
మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్.. తన కేసుల్లో లబ్ధి కోసమే ఇలాంటి లేఖలు రాస్తున్నారన్నారని, జడ్జిలపై ఆరోపణలు చేయడం ద్వారా వాళ్లిచ్చే తీర్పుల పట్ల ప్రజల్లో చులకన భావం కలిగేలా చేయడం, మొత్తంగా న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలిగించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నటుందని సీజేఐకి రాసిన లేఖలో అశ్విని ఉపాధ్యాయ ఆరోపించారు. సుప్రీం జడ్జి జస్టిన్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలపై జగన్ చేసిన ఆరోపణల వ్యవహారంపై సుప్రీం ఫుల్ కోర్టును సమావేశపర్చి, ఏపీ సీఎంపై చర్యలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఎవరు కూడా న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నాలు చేయకుండా నిరోధించగలమని ఉపాధ్యాయ పేర్కొన్నారు.
ఏపీ సీఎంపై ఫిర్యాదుల పర్వం..
హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఒక ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం, వాటికి సంబంధించిన ఆధారాలను మీడియాకు విడుదల చేయడం దేశ చరిత్రలో తొలిసారి కావడంతో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీజేఐకి లేఖ రాసిన తర్వాత వారం పాటు పలువురు మద్దతు ప్రకటనలు చేయగా, గడిచిన మూడు రోజుల నుంచి ఏపీ సీఎంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ అడ్వొకేట్లు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ లు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా గురువారం నాడు ఏపీ హైకోర్టు మాజీ జడ్జి నౌషద్ అలీ సైతం సీజేఐకి లేఖ రాశారు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్ దిగజార్చుతున్నారని జస్టిస్ అలీ పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక,రక్షణ శాఖలు వైసీపీకి దక్కుతాయని మావాళ్ల టాక్-ఏపీలో స్మగ్లింగ్పై ఢిల్లీ నజర్:రఘురామ