చంద్రబాబుపై ఊగిపోయిన బీజేపీ నేత, ఎమ్మెల్యేలకు నోటీసులపై వైసిపి
చిత్తూరు: గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ రైతులకు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిని పక్కన పెట్టి గోదావరి ఎత్తిపోతల పథకాలను చేపట్టి డెల్టా రైతులకు చంద్రబాబు సర్కారు అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్వీ నాయుడు ఆగ్రహించారు.
మంగళవారం నాడు ఆయన అమలాపురంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి రూ.వేల కోట్ల నిధులు ఇస్తోందన్నారు. కానీ నిన్న పట్టిసీమ, తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అక్వా రంగాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో అక్వా వల్ల, ఉప్పునీటి వల్ల పంట చేలు బీడు భూములుగా మారాయన్నారు.
కాగా, అక్వా ఫుడ్ పార్క్ విషయమై బాధితులు కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన వారికి మద్దతు పలికారు. అనంతరం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజల అందోళనను పట్టించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే, ఇప్పుడు బీజేపీ నేత అక్వాను ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
హోదా కోసం త్యాగాలకు సిద్ధం: చెవిరెడ్డి
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి బుధవారం అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అసెంబ్లీలో తాము పోరాటం చేశామని చెప్పారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోరాటం చేస్తే తమకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి దాకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.