మెంటల్ కండీషన్ బాగోలేదా ? సొంతపార్టీ పై కోపమా ? జమ్ముకాశ్మీర్ పై కేశినేని వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
విజయవాడ ఎంపీ కేశినేని నాని జమ్మూ కాశ్మీర్ పునర్విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నానీ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీతోనే విబెదిన్చినట్టు ఉన్నాయని ఇప్పటికే పలువురు విమర్శించారు.పీవీపీ నానీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాజాగా బీజేపీ నాయకులు నానీ వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని భిన్నంగా స్పందించారు . ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ సైతం మద్దతు తెలిపినా కేశినేని నానీ మాత్రం కాశ్మీర్ ప్రజల అభిప్రాయం కనుక్కొని వారి సమ్మతంతో జమ్ముకాశ్మీర్ పునర్విభజన చేస్తే బాగుండేది అనే అభిప్రాయం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఒక పక్క టీడీపీ బీజేపీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తే నానీ మాత్రం తన ట్వీట్ లో "కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు. ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ,గులాంనబీ ఆజాద్ ,ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకులకైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి, తరువాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు" అని అన్నారు. ఇక దీనిపై బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి ఫైర్ అయ్యారు.
జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు పలు పార్టీల మాదిరిగానే టీడీపీ కూడా మద్దతు ఇచ్చిందని పేర్కొన్న విష్ణు వర్ధన్ రెడ్డి కేశినేని నానీ మానసిక స్థితి సరిగా లేదా? అని ప్రశ్నించారు . లేదంటే ఆయనకు తన పార్టీ మీద కోపమా? అని విష్ణువర్దన్రెడ్డి నానీ తీరును ఆక్షేపించారు . చితికిపోయిన ఆర్థిక కారణాలతో ఈ రకంగా తయారయ్యారా? అని మరో ప్రశ్న సంధించారు . ఇక కేశినేని నాని కశ్మీర్ చరిత్ర తెలుసుకుంటే మంచిదని విష్ణువర్దన్రెడ్డి హితవు పలికారు. ఒకపక్క టీడీపీ మద్దహు ఇస్తుంటే నానీ వ్యతిరేకించినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని భావించిన నేపధ్యంలోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసి నానీకి చురకలు అంటించారు విష్ణు వర్ధన్ రెడ్డి .