18 పార్టీలు సరే, ఒక్క పార్టీతో చెప్పంచలేదు: బాబుకు కృష్ణంరాజు మరో షాక్
అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెప్పుకోవడానికి ఏదీ మిగలదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు సోమవారం మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం కోసం 18 పార్టీల మద్దతును కూడగట్టాయన్నారు. జాతీయ విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి కేంద్రం కృషి చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేతల వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం భావ్యం కాదన్నారు.
దేశంలో తిరుగులేని నేత మోడీనే అన్నారు. మోడీపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అవిశ్వాస తీర్మానం ద్వారా తెలిసిందన్నారు. కేంద్ర మంత్రులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించబోతున్నారన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారని, త్వరలోనే వాటికి శాశ్వత భవనాలను నిర్మిస్తారన్నారు.
అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమైతే వాటికి కావాల్సిన వనరులను కేంద్రం చూపిస్తుందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి ఇకపై ఏ అంశం మిగలదన్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై నివేదికను తయారు చేసి, ఢిల్లీ పెద్దలకు పంపుతామన్నారు. త్వరలోనే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అవుతామన్నారు.
Recommended Video
18 పార్టీలలో ఒక్క పార్టీతో అన్యాయం చెప్పించలేకపోయారు
అవిశ్వాసం కోసం టీడీపీ నేతలు వివిధ పార్టీ నేతలను కలిశారని, వారి మద్దతు కూడగట్టామని చెప్పారని, కానీ మద్దతిచ్చిన 18 పార్టీలలో ఒక్క పార్టీతో కూడా ఏపీకి జరిగిన అన్యాయం చెప్పించలేకపోయారని కృష్ణంరాజువిమర్శించారు. స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, ట్రైబల్ వర్సిటీపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
చంద్రబాబు వైఫల్యం
ఏపీకి బీజేపీ అన్యాయం ఏమీ చేయలేదని, పదేళ్లలో చేయాల్సిన వాటిని నాలుగేళ్లలోనే చేసిందని, అందుకే అవిశ్వాస తీర్మానంలో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ఏ ఇతర పార్టీ చెప్పలేకపోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కూడా పదేపదే అన్యాయం చేసిందని చెప్పడం, నాటి హామీలు గుర్తు చేయడమే తప్ప.. స్పష్టంగా ఏం చేయలేదో చెప్పలేకపోయిందని అంటున్నారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, ఏపీకి జరిగిన అన్యాయం చెప్పించలేకపోవడం చంద్రబాబు మరో వైఫల్యమని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
తెలుగు జాతీయసంస్థలకు కేంద్రం రుణం
ఇదిలా ఉండగా, మౌలిక వసతులు, పరిశోధనలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కేంద్రం 12 ఐఐటీలు, ఎన్ఐటీలకు రూ.8049.47 కోట్ల రుణం మంజూరు చేసింది. ఉన్నత విద్య నిధుల సంస్థ (హెఫా) ద్వారా కేంద్రం ఇచ్చే రుణాలకు, ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) ఆమోదం తెలిపింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఐఐటీలు, ఒక ఎన్ఐటీ కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా 5 ఐఐటీలు, ఒక ఎన్ఐటీకి రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలపగా తాజాగా 12 విద్యా సంస్థలకు పచ్చజెండా ఊపింది.
వడ్డీని కేంద్రమే చెల్లిస్తుంది
హైదరాబాద్ ఐఐటీకి రూ.500 కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.976.89 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి రూ.365.23 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాల జాతీయ సంస్థలకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రుణాన్ని పది సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. వడ్డీని మాత్రం కేంద్రం బ్యాంకుకు చెల్లిస్తుంది. మరోవైపు, ఎన్ఐటీ వరంగల్కు త్వరలో రుణం మంజూరు కానుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా రుణం కోసం ప్రతిపాదనలను త్వరలో సమర్పించనుంది.