చంద్రబాబు కృషి భేష్:కృష్ణంరాజు;జగన్ సీఎం అయితే కష్టాలు ఉండవు:పెద్దారెడ్డి
Recommended Video
విశాఖపట్నం,అనంతపురం:ఇటీవలే సిఎం చంద్రబాబుపై మండిపడ్డ సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కృష్ణంరాజు కితాబునిచ్చారు.
గురువారం ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అయితే జగన్,పవన్ లకు బీజేపీ స్క్రిప్ట్ ఇస్తోందన్న ఆరోపణలను కృష్ణంరాజు ఖండించారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా బీజేపీపై నెగిటివ్ అభిప్రాయం లేదని కృష్ణంరాజు అన్నారు. పాటలు, స్కిట్స్ ద్వారా ప్రజలకు అసలు నిజాలు తెలియజేయనున్నట్లు కృష్ణంరాజు వెల్లడించారు.
మరోవైపు జగన్ సీఎం అయితే మన కష్టాలన్నీ తీరుతాయని వైసీపీ అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి ఏమీ చేయలేని టీడీపీ ఇప్పుడు ఓట్ల కోసమే దొంగదీక్షలు చేస్తోందని మాజీ ఎంపీ, వైసీపీ నేత అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం చేశారన్నారు. గతంలో హోదా కోసం తాము పోరాటం చేస్తే ప్యాకేజీనే ముఖ్యమని టీడీపీ భావించిందన్నారు. అప్పట్లో కేంద్రం చేసే సాయం కన్నా ఎక్కువ ఎవరూ చేయరని టీడీపీ నేతలు పేర్కొన్నారని గుర్తుచేశారు.
వెనుకబడిన జిల్లాలకు ఐదేళ్లకు గాను కేంద్రం రూ. 24,350 కోట్లు ఇవ్వాలని నిర్ధారించిందన్నారు. కానీ ఏడాదికి రూ. 350కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అందులోనూ రూ.50 కోట్లలో రూ.29 కోట్లు జల ఫిరంగులకు, మిగిలింది సీసీ రోడ్లకు కేటాయించారన్నారు. ఆ నిధులు కమీషన్లకే సరిపోయాయని ఆయన ఆరోపించారు. టీడీపీ అవినీతి వల్లే కేంద్రం తన నిధులు వెనక్కు తీసుకుందన్నారు.
ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో టిడిపి నేతలు దొంగ దీక్షలు చేపట్టారన్నారు. 2012లోనే హంద్రీనీవా ద్వారా నీరు తీసుకొచ్చామని, అదీ టీడీపీ ఘనత అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నా రు. ఇంకా యాడికి కాలువకు, ఆయకట్టుకు నీరు ఇవ్వని దుస్థితి ఉందన్నారు. టీడీపీ నేతలకు చంద్రబాబును పొగడడానికి, జగన్ను విమర్శించడానికే సరిపోయిందని అనంతవెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు.