స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటిషన్- వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ..
న్యాయస్ధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరుకునపడ్డారు. కోర్టులే అన్నీ చెప్పేస్తే ఇక ఎమ్మెల్యేలెందుకు, ఎన్నికలెందుకంటూ తాజాగా చిత్తూరు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్దపై బాధ్యతాయుత రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్ లో ఆయన ఆరోపించారు.
ఏపీలో తాజాగా హైకోర్టులో వెలువడుతున్న తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి మద్దతుగా స్పీకర్ సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు న్యాయవర్గాల్లోనూ కలకలం రేపాయి. ప్రభుత్వమే ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయించిందన్న వాదనలు కూడా వినిపించాయి. దీంతో న్యాయవ్యవస్దపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపిస్తూ బీజేపీ నేత రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అత్యవసర కేసులను మాత్రమే హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది.