హామీలు : చంద్రబాబు బిజెపి కేంద్రమంత్రుల్ని టార్గెట్ చేశారా?
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీలో బిజెపి నేతలను.. ముఖ్యంగా కేంద్రమంత్రులుగా ఉన్న బిజెపి నేతలను లక్ష్యంగా చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నారు.. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపురెడ్డి సురేష్ రెడ్డి.
మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు, బిజెపి నేతల పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సబబు కాదన్నారు.
కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి రూ.లక్షా 40వేల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలుగుదేశం పార్టీవే అని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఇటీవల కేంద్రమంత్రులు - చంద్రబాబు మధ్య పరోక్ష మాటల యుద్ధం నడుస్తోందనే వాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.
వారం రోజుల క్రితం కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్, ఆ తర్వాత రెండు రోజుల క్రితం వెంకయ్య నాయుడులు చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు కూడా పరోక్షంగా కేంద్రమంత్రులకు నిధులు, సహాయం పైన ఒకింత హెచ్చరికగానే సూచన చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. కేంద్రం హామీలు నెరవేర్చడం లేదని, దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయాన్ని కేంద్రమంత్రి ముందు వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు మాటలనే కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ అప్పగించారు.
కేంద్రమంత్రి బీరేంద్ర మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘాన్ని రిఫర్ చేస్తూ అదేమీ రాష్ట్రం కోసం అదనపు నిధులు విడుదల చేయమని ప్రత్యేక సిఫార్సులు చేయలేదని చెప్పారు. అంతేకాదు, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు వాటిని ఏదోవిధంగా సమకూర్చుకోగల సమర్థుడని చెప్పారు. తద్వారా కేంద్రంపై ఆధారపడటం మానుకోవాలని కేంద్రమంత్రి పరోక్షంగా చంద్రబాబుకు చెప్పారని అర్థమవుతోందని అంటున్నారు.
చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇటీవల పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవలే వెంకయ్య నాయుడు, చంద్రబాబు మధ్య పరోక్ష మాటల యుద్ధం నడిచినట్లుగా ఓ పత్రికలో వార్తలు వచ్చాయి. నిధులు కావాలని చంద్రబాబు అడగగా, చంద్రబాబు సమర్థుడు అని, ఏమైనా సాధించగలడని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.