పవన్కు తెలియదేమో, అప్పుడే మాట్లాడాలి, ఆయన సినిమాలు కావొచ్చు: బీజేపీ షాకింగ్ కౌంటర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తెలిసి ఉండకపోవచ్చునని, ఆయన మరింత అధ్యనయం చేయాలని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ బుధవారం నాడు అన్నారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాల పైన తాను పూర్తిగా అవగాహన చేసుకున్నానని, ఆ తర్వాతనే మాట్లాడుతున్నానని, లేదంటే ఫెయిల్ అయిన తాను అడగటం ఏమిటని ప్రశ్నిస్తారని అనంతపురం సభలో పవన్ అభిప్రాయపడ్డారు. దీనికి సిద్ధార్థనాథ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక ప్యాకేజీని పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడాలన్నారు. అంతేకానీ కేవలం విమర్శల కోసమే విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. రెండున్నరేళ్లయినా చేసిందేమీ లేదని, అందిన నిధులు కూడా స్వల్పమేనని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను విలేకరులు ప్రస్తావించడంతో పైవిధంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్కు బహుశా తెలిసి ఉండకపోవచ్చునని, ఆయన సినిమాలు లేదా సినీ పరిశ్రమలకు నిధులు నెమ్మదిగా వస్తుండవచ్చునని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు మాత్రం అవసరమైన మేరకు వెళ్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు అన్నీ తెలుసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు విడుదలవుతున్నాయన్నారు.
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించిందని, దానికి చట్టబద్ధత ఉందని చెప్పారు. అవసరం అనుకుంటే కేబినెట్ ఆమోదం కూడా లభిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి రోజే చెప్పారన్నారు.