ఎస్వీబీసి ఘటనపై విచారణకు డిమాండ్ చేసిన బీజేపీ నేత సునీల్ దేవధర్
ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం సృష్టించిన విషయం దానిని టీటీడీ సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే . శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపిన ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నీచమైన పనులకు పాల్పడి టీటీడీ పరువును గంగలో కలపొద్దు అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు .
ఎస్విబీసి ఆఫీసులో టిటిడి విజిలెన్స్ సైబర్ క్రైం అధికారులు తనిఖీలు నిర్వహించి లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అశ్లీల సైట్స్ చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు . విధులు నిర్వర్తించకుండా వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించిన అధికారులు సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు . ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ అధికారులు ఇప్పటికే పోర్న్ చిత్రాల లింక్లు పంపిన ఉద్యోగులపై వేటు చేసింది. వీడియోలు చూసిన మరికొంత మంది ఉద్యోగులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎస్వీబీసీ సీఈవో ప్రకటించారు.
ఎస్వీబీసీ ఛానల్ లో అశ్లీల వెబ్ సైట్ లింకులు పంపడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సలహా ఇన్చార్జ్ సునీల్ దేవధర్. ఎస్విబిసిలో జరిగిన తప్పిదంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు . ఈ రోజు తిరుమల శ్రీవారినిదర్శించుకున్న అనంతరం బీజేపీ నేతలతో కలిసి సునీల్ దేవధర్ మాట్లాడారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ లో రామ మందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్విబిసి టీవీ కార్యాలయం నుంచి అశ్లీల మెయిల్స్ పంపడం వంటి చేయరాని పనులు జరగదన్నారు. ఎస్విబిసి లో ధార్మిక కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేయాలని, ఎస్విబిసి ఉద్యోగులు ధర్మ ప్రవర్తన కలిగిన వారై ఉండాలని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, నిధులతో పాటు ఎర్రచందనాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు.