ఏపీలో బీజేపీ చూస్తూ కూర్చోదు - అసలు లక్ష్యం ఇదే : టీజీ వెంకటేష్..!!
ఏపీలో బీజేపీ ప్రణాళికలపై ఆ పార్టీ నేత టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై బీజేపీ చూస్తూ కూర్చోదని చెప్పారు. కర్నూలు వేదికగా న్యాయ రాజధాని డిమాండ్ తో గర్జన జరుగుతున్న వేళ టీజీ వెంకటేష్ స్పందించారు. రాయలసీమ హక్కుల కోసం పోరాట వేదిక ద్వారా కొన్ని సాధించామని చెప్పారు. రాయలసీమ డిక్లరేషన్ పై బిజెపి కూడా అండగా ఉందన్నారు. సమస్యలు పై స్పందించాలని మా అధ్యక్షులు సోమువీర్రాజు సిఎం కు లేఖ రాశారని గుర్తు చేసారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా చాలా చేస్తామని చెప్పి చేయలేదని వ్యాఖ్యానించారు. బుండేల్ , సిద్దేశ్వరం, సరస్వతి, అన్నమయ్య హంద్రీనీవా ప్రాజెక్టు లు పట్టించుకోలేదన్నారు. ఇటువంటి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బిజెపి చెప్పిన ప్రతిమాటా అమలు చేసిందని..రాజధాని అభివృద్ధి కి నిధులు కూడా ఇచ్చారని వివరించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం అయినా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీకి అసలు రాజధానే లేదు
హైకోర్టు రాయలసీమ లో అన్నవారు.. ఆ తరువాత అమరావతి లో పెట్టారని చెపుకొచ్చారు. నేడు అదే హైకోర్టు కోసం రాయలసీమ లో ఉద్యమం చేస్తున్నారన్నారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశారన్నారు. రాయలసీమ వాసులే రాష్ట్రాన్ని పాలించారన్నారు. రతనాల సీమ ఏమో గానీ... ఇంకా వెనక్కి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాయలసీమ డిక్లరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేసారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా జనాలను రోడ్ల మీదకు లాగుతున్నారని చెప్పారు. అమరావతి లేదు, విశాఖ లేదు.. ఎపికి అసలు రాజధాని లేదని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం విధానాల వల్ల అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నారన్నారు.
ఎపి పై బీజేపీ అధిష్టానం దృష్టి
అమరావతే ఏకైక రాజధాని అనేది బిజెపి విధానమని స్పష్టం చేసారు. రాయలసీమ కు హైకోర్టు లేదు, బెంచ్ కూడా లేదని సుప్రీంకోర్టు లో చెప్పారన్నారు. ఇది ఇప్పుడు పెద్ద ఇబ్బంది గా మారుందనేది వాస్తవమన్నారు. రాయలసీమ కు హైకోర్టు తీసుకు వచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. మేధావి బుగ్గన సినిమాటిక్ గా కాదు... రియాలటిక్ గా మాట్లాడాలన్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత ఎపి పై బీజేపీ అధిష్టానం దృష్టి పెడుతుందని టీజీ వెంకటేష్ వెల్లడించారు.