ఎవరితో కాపురం చేయాలి, నా భార్యకు అనుమానం వచ్చిందన్నాడు: వెంకయ్య
విశాఖ: గతంలో ఓసారి రాయలసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఓ రైతు తనతో భార్యతో కాపురం చేయాలా లేక మోటారుతో కాపురం చేయాలా అని ప్రశ్నించాడని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. ఏపీని మొన్నటి దాకా అంధేరా ప్రదేశ్ అని పిలిచేవారన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. తాను సీమలో గతంలో పర్యటించానని చెప్పారు. ఓ రైతు తనని కలిసి.. కరెంట్ లేక చాలా కష్టంగా ఉందని చెప్పాడని గుర్తు చేశారు. పైగా తనకు ఈ మధ్యనే వివాహం అయిందని కూడా ఆ రైతు చెప్పాడన్నారు.
అయితే సంతోషంగా ఉండాలని తాను ఆ రైతుతో అన్నానని వెంకయ్య తెలిపారు.
పగలు కరెంట్ రావడం లేదని, రాత్రి తలుపేసుకొని లోపల పడుకుంటే పెద్దవాళ్లు వచ్చి తలుపు కొడుతున్నారని, ఏమంటే కరెంట్ వచ్చింది, పోయి మోటార్ వేసి రావాలని చెబుతున్నారని, మోటారు వేసిన అరగంటకే మళ్లీ కరెంట్ పోయేదని, మళ్లీ ఇంటికి రావడం, కరెంట్ వస్తే మెళ్లీ వెళ్లి మోటారు వేసి రావడం జరిగేదని తనకు ఆ రైతు బాధను చెప్పాడన్నారు.
తాను పదేపదే బయటకు వెళ్లుతుండటంతో తన భార్యకు అనుమానం వచ్చిందని, అసలు నేను భార్యతో కాపురం చేయాలా లేక మోటారుతో కాపురం చేయాలా అర్థం కావడం లేదని ఆ రైతు అన్నాడని వెంకయ్య చెప్పారు.
ఈ రోజు విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో పెట్రోలియం విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. అనంతరం వంగలిలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య, ధర్మేంద్ర ప్రదాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. కేంద్రం సాయంతో ఏపీ వెలుగుల ప్రదేశ్గా మారిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఏ ఇంటిలో పొగగొట్టం ఉండకూడదన్నారు. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేలా చేస్తామని తెలిపారు. రూ.1.20లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత ముఖచిత్రం మారిపోతుందన్నారు. దేశానికి కావాల్సింది మాటలు కాదు.. చేతలు, అభివృద్ధి అన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడారు. రూ.35వేల కోట్ల పెట్టుబడితో త్వరలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. పెట్రోలియం వర్సిటీలో చదువుకున్న వారికి వందశాతం ఉద్యోగం లభించేందుకే నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను ఓడీఎఫ్లుగా ప్రకటించాం. పెట్రోలియం వర్సిటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మెరైన్ వర్సిటీలు వచ్చాయి. పెట్రోలియం రంగంలో రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే, దేశం మనవైపు చూస్తోందన్నారు. విశాఖకు 8 ఐటీ సంస్థలు వచ్చాయని, మరిన్ని రానున్నాయన్నారు. అన్ని కళాశాలలకు ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు.