కేటీఆర్.. సంగారెడ్డి ఘటన కనిపించడం లేదా, ‘ఢిల్లీ’ ట్వీట్పై బీజేపీ నేత ఘాటు రియాక్షన్..
తెలంగాణ మంత్రి కేటీఆర్పై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మండిపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై పోలీసులను ప్రశ్నించిన కేటీఆర్కు సంగారెడ్డి, ఆదిలాబాద్ ఘటనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇవేకాదు రాష్ట్రంలో పలు మిస్సింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయని ఆమె చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసుల తీరును అడుగుతోన్న కేటీఆర్.. ముందు మీ పోలీసుల తీరు తెలుసుకోవాలని విజయ సూచించారు. సంగారెడ్డిలో నారాయణ కాలేజీలో విద్యార్థిని చనిపోయి హృదయ విదారకరంగా తండ్రి ఉంటే.. బూటు కాలితో పోలీసులు తన్నిన విషయం గుర్తుచేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. పోలీసుల తీరు సరికాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఆదిలాబాద్లో దళితులపై అఘాయిత్యాలు జరిగితే పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు చేసింది కరెక్ట్.. ఢిల్లీ పోలీసులు చేసింది తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు.. ఖాకీల్లా వ్యవహరించడం లేదని.. టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారు ఖాకీ చొక్కా వదిలి.. పింక్ షర్ట్ వేసుకున్నట్టు అనిపిస్తోందన్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షించి, ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు... గులాబీ రంగు ఖద్దర్కు అండగా ఉంటున్నారని విమర్శించారు.