జగన్ అలా అనకూడదు: దాడి ఘటనపై విష్ణు, 'అప్పుడే ఢిల్లీ డైరెక్షన్లో అసలు కథ ప్రారంభం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కుట్రపూరితంగా, ప్రణాళికతో దాడి జరిగిందని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సోమవారం అన్నారు.
చంద్రబాబుకు పోలీస్ రిపోర్ట్ షాక్, గురి తప్పితే ప్రాణం పోయేది!: జగన్కు సిట్ మెమో
దాడి వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నాడని టీడీపీ నేతలు అనడం సరికాదని చెప్పారు. అలాగే, ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ అనకూడదని అన్నారు.
కోడి కత్తి డ్రామా వికటించడంతో వైసీపీ ఢిల్లీలో రగడ
కోడి కత్తి డ్రామా ఆంధ్రప్రదేశ్లో వికటించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రగడ చేస్తోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. దాడిని ఖండించకూడదని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. దాడిలో గాయపడిన వ్యక్తిని విమానంలో ఎలా పంపించారో చెప్పాలని నిలదీశారు. దాడిపై చిలవలు వలవలు చేసే ప్రయత్నం చేశారన్నారు.
ఈ డ్రామా కేసుకు సీబీఐ విచారణ కావాలా?
రిమాండ్ రిపోర్టు బాగుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని, మరోవైపు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్నారని, ఇదేమిటని కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసలు కోడి కత్తి లాంటి డ్రామా కేసులకు సీబీఐ విచారణ కావాలా అని ఎద్దేవా చేశారు.
అప్పటి నుంచి ఢిల్లీ డైరెక్షన్లో అసలు కథ ప్రారంభం
జగన్పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సోమవారం నిప్పులు చెరిగారు. బంధువుల ఆసుపత్రిలో అయితే తమకు ఇష్టం వచ్చిన సర్టిఫికేట్ తీసుకోవచ్చునని జగన్ భావించి ఉన్నారని, అందుకే హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రథమ చికిత్సకు చెందిన రిపోర్టులు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు పరిశీలించారా అని నిలదీశారు. అవేం పట్టించుకోకుండా సొంత వైద్య నివేదికలు ఇచ్చారన్నారు. జగన్కు చట్టం అన్నా, విచారణ అన్నా గౌరవం లేదన్నారు. కనీసం పోలీసులకు చెప్పకుండా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారని, అప్పటి నుంచి ఢిల్లీ డైరెక్షన్లో అసలు కథ ప్రారంభమైందన్నారు.
జగన్ నాడు సీబీఐని తప్పుబట్టి, నేడు అదే విచారణ ఎలా కోరుతారు
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను వైసీపీ నేతలు కలవడం ద్వారా బీజేపీ, వైసీపీ ఉమ్మడి స్కెచ్ బయటపడిందని కనకమేడల రవీంద్ర బాబు అన్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను తప్పుబట్టిన ఇప్పుడు కేంద్ర సంస్థలతో దర్యాఫ్తు ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు. పాదయాత్రకు బ్రేక్ కావాలని జగన్ నాటకాలు అన్నారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. జగన్ పైన దాడి జరిగిన వెంటనే స్పందించిన గవర్నర్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేస్తే ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం కానీ, డీజీపీ కానీ కేసు విచారణ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పలేదని, విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉందని మాత్రమే చెప్పారన్నారు.
ఇలాంటి కోడి కత్తి కేసుల్లో జోక్యం చేసుకొని అస్థిరపరచాలనే యత్నం
జగన్ పైన దాడి కేసు మీద రాష్ట్ర పోలీసులతో దర్యాఫ్తు చేయిస్తే వారి కుట్ర బయటపడుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారని రవీంద్ర బాబు అన్నారు. అందుకే కేంద్ర సంస్థలతో దర్యాఫ్తు కోరుతున్నారని చెప్పారు. ఇలాంటి కోడి కత్తి కేసుల్లో కేంద్రం జోక్యం చేసుకొని, వైసీపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తోందని, దీనిపై ఐదు కోట్ల మంది ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.