బీజేపీ టార్గెట్.. కమలం నేతకు షాక్: హోమ్ క్వారంటైన్లో ఉండాలంటూ నోటీసులు: వైసీపీ కుట్రగా..
అనంతపురం: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు షాకిచ్చారు. హోమ్ క్వారంటైన్లో ఉండాలంటూ ఆయనకు నోటీసులను జారీ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో ఉండే ఆయన నివాసానికి ఈ మేరకు నోటీసులు అతికించారు. కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న కర్నూలులో పర్యటించి వచ్చారాయన. ఈ పర్యటనను లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించారు అధికారులు. వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలను విష్ణువర్ధన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. తెలియక ఇచ్చారని వ్యాఖ్యానించారు.
విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే కర్నూలులో పర్యటించారు. అనంతరం ఆయన కొద్దిమంది అనుచరులతో కలిసి అనంతపురం జిల్లా కదిరికి వెళ్లారు. అసలే రెడ్జోన్లో ఉన్న కర్నూలులో ఆయన పర్యటించడం, అనుమతులు లేకుండా అక్కడి నుంచి కదిరి వెళ్లడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. రెడ్జోన్లో ఉన్న కర్నూలులో పర్యటించడం వల్ల కరోనా వైరస్ సోకి ఉండొచ్చని, వెంటనే 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశిస్తూ అనంతపురం జిల్లా వైద్య శాఖ అధికారులు ఆయనకు నోటీసులను జారీ చేశారు. నోటీసులను ఇవ్వడానికి వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో దాన్ని ఆయన ఇంటి గేటుకు అతికించారు.
ఈ 28 రోజుల పాటు ఎక్కడికీ వెళ్లొద్దని ఈ హోమ్ క్వారంటైన్ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనకు హోం క్వారంటైన్ నోటీసులు ఇవ్వడంపై విష్ణువర్థన్రెడ్డి స్పందించారు. తనకు హోం క్వారంటైన్ నోటీసులు ఇవ్వలేదని, ఇంటికి అతికించారా? లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తనకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుందని.. దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు ఉందని వివరించారు. ఈ విషయం తెలియక సీఐ, ఎస్ఐ ఈ నోటీసులను ఇచ్చినట్లు చెప్పారు.
Recommended Video
జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్లో పెడతారా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలకు ఓ రూల్.. ప్రతిపక్ష పార్టీలకు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టం వచ్చినట్లు జిల్లాల్లో తిరిగారని.. వారిని ఎందుకు క్వారంటైన్కు పంపలేదని ప్రశ్నించారు. సాయం పేరుతో ర్యాలీలు, సభలు పట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేద, కిట్ల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇలా కక్ష సాధిస్తున్నారని విష్ణువర్థన్రెడ్డి విమర్శించారు.