కేసీఆర్ వాడుకుని వదిలేసే రకం: జగన్ తెలుసుకోవాలన్న మాజీ ఎంపీ వివేక్
తెలంగాణా రాష్ట్ర సీఎం వైఖరి ఎలాంటిదో మాజీ ఎంపీ , గతంలో గులాబీ పార్టీలో కీలకంగా పని చేసిన వివేక్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంల మైత్రీ బంధంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిజస్వరూపం జగన్ కు తెలీదని,కేసీఆర్ ది యూజ్ అండ్ త్రో పాలసీ అని మాజీ ఎంపీ వివేక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తిరుమల పర్యటనలో సీఎం కేసీఆర్ , జగన్ ల దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన వివేక్
పెద్దపల్లి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ జి.వివేక్ గతంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన ఆయన గత ఎన్నికల్లో పెద్దపల్లి నుండి టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇక బీజేపీ తీర్ధం పుచ్చుకున్న వివేక్ అప్పటి నుండి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ, తెలంగాణా సీఎంల స్నేహ సంబంధాలపై తాజాగా ఆయన తిరుమల పర్యటన నేపధ్యంలో వ్యాఖ్యలు చేశారు.
తెలుగురాష్ట్రాల సీఎంల మధ్య స్నేహసంబంధాలేమీ లేవు
కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న వివేక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. వివేక్ను స్వామివారి వస్త్రాలను అందించి, సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక ఈ నేపధ్యంలో వివేక్ మీడియాతో మాట్లాడారు . తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ల మైత్రిపై మాజీ ఎంపీ వివేక్ చాలా ఘాటుగా స్పందించారు . తెలుగురాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్ , జగన్ ల మధ్య మంచి స్నేహం ఉందని అనుకుంటున్నారని కానీ అంత సీన్ లేదని చెప్పారు.
కేసీఆర్ కు ఎప్పుడూ శాశ్వత మిత్రులు ఉండరని చెప్పిన మాజీ ఎంపీ
కేసీఆర్, జగన్ మిత్రులని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్న వివేక్ సీఎం కేసీఆర్ కు ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరని పేర్కొన్నారు. ఆయన తన అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారని వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్ అందరినీ తన అవసరానికి వాడుకొని వదిలేస్తాడని, అలాంటి రకం అని గుర్తించే తాను పార్టీ నుండి బయటకు వచ్చానని ఆయన అన్నారు. ఇక సీఎం జగన్ కు కేసీఆర్ గురించి బాగా తెలియదని ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ తెలుసుకోవాలని సూచించారు. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ , లింక్ ప్రాజెక్ట్స్ పేరుతో కమిషన్ల కోసమే జగన్తో కేసీఆర్ మైత్రిని కొనసాగిస్తున్నాడని వివేక్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.