బీజేపీ దీక్షలు: సీపీఎం నేతల రాకతో ఘర్షణ, ఉద్రిక్తత, బాబుపై జీవీఎల్ నిప్పులు, ‘టీడీసీ’ అంటూ ఎద్దేవా
అమరావతి: పార్లమెంటులో విపక్షాలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. విజయవాడలో ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, విశాఖపట్నంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, అమలాపురంలో ఎంపీ గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగకుండా విపక్షాలు అప్రజాస్వామికంగా వ్యవహరించాయంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే బీజేపీ నేతల దీక్షల వద్దకు వచ్చిన సీసీఎం, వామపక్ష నేతలు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి.
Clash between BJP and left workers at Vizag's Central Park. #SpecialStatus #AndhraPradesh pic.twitter.com/AmR0W0yJ18
— ANI (@ANI) April 12, 2018
విశాఖపట్నం, భీమవరంలలో బీజేపీ.. వామపక్ష, వైసీపీ కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేదాక వెళ్లడంతో భారీగా చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా, ఇరుపార్టీల నేతలు, కార్యర్తలు తగ్గలేదు. మరిన్ని పోలీసు బలగాలను రప్పించి అక్కడ్నుంచి ఇరుపార్టీల నేతలను పంపించేశారు.
కాంగ్రెస్ కలిసిపోయి..
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న నిరాహార దీక్షను అడ్డుకనేందుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంటును అడ్డుకున్నాయని నరసింహారావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మాకు అనుమతి తిరస్కరిస్తారా? టీడీపీ ఆంతర్యం ఏంటీ?
విజయవాడలోని లెనిన్ సెంటర్లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా తిరస్కరించారని చెప్పారు. పార్లమెంటు నిర్వహణలో అడ్డుపడటమే కాక, బీజేపీ శాంతియుతంగా నిరాహార దీక్షకు కూడా టీడీపీ అడ్డుపడుతోందని అన్నారు. బుధవారం లెనిన్ సెంటర్లో సీపీఐ దీక్షకు అనుమతించారని, బీజేపీకి అదే స్థలంలో దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నా చౌక్లో నిరాహార దీక్షకు విజయవాడ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
తెలుగు కాంగ్రెస్ పార్టీ(టీడీసీ)గా మార్చుకోండి..
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఏపీలో చాలా కాంగ్రెస్ పార్టీలున్నాయని, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి బీజేపీపై కుట్ర చేస్తోందని విజయవాడల దీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆరోపించారు. దేశం మొత్తం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆయన పంచన చేరుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని తెలుగు కాంగ్రెస్ పార్టీగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తోంది..
కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు దే పార్టీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఈరోజున టీడీపీ కాంగ్రెస్ పంచన చేరి సిగ్గులేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విభజన చేసి ఏపీ గొంతుకోసిన పార్టీతో కలిసినడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డుకుంది మేమంటారా?
విశాఖపట్నంలో దీక్ష చేసిన సందర్భంగా ఎంపీ హరిబాబు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసనలు చేసినా టీడీపీ సర్కారు అడ్డుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటును అపహాస్యం చేసిందని మండిపడ్డారు. అవిశ్వాసాన్ని బీజేపీ అడ్డుకుందనడం సరికాదని, బీజేపీ సభ్యులు వారి వారి స్థానాల్లో ఉంటే.. పార్లమెంటులో టీడీపీ, ఇతర విపక్షాలే ఆందోళనలు చేశాయని అన్నారు. 23రోజులపాటు సమావేశాలు జరిగకుండా చేసి ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతోపాటు ఎమ్మెల్సీ మధు, ఇతర నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.