గొడుగులతో అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యేలు:భాజపా నేతలు హీరో, విలన్ మధ్య కమెడియన్స్లా తయారయ్యారన్న బుద్దా
Recommended Video
అమరావతి: గురువారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యేలు గొడుగులు, రెయిన్ కోట్లతో రావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగానే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.
ఏపీ అసెంబ్లీ: గొడుగు, రెయిన్ కోట్తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేత ఆగ్రహం
టిడిపి ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలోకి కొద్దిపాటి వర్షాలకే నీళ్లు వచ్చేస్తున్నాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా తమ ఏర్పాట్లుతో సమావేశాలకు విచ్చేశామని బిజెపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సచివాలయమా.. జలపాతమా అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారు. ఇదిలా వుండగా భాజపా నేతలు కమెడియన్లలా తయారయ్యారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాలు...ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు ఉదయం 8.15 కి శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగగా...సమావేశానికి మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజులు హాజరయ్యారు.
గొడుగులతో...బిజెపి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొడుగులు, రెయిన్ కోట్లతో రావడం కలకలం రేపింది. వచ్చారు. చిన్నపాటి వర్షాలకే అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మొత్తం లీకులమయమైందని... వేయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని వారు ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
భాజపా ప్రజాప్రతినిధులు...నిరసన
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగానే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శనకు దిగారు. గొడుగులు, రెయిన్కోట్లతో రావడం గురించి చెబుతూ చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ, సచివాలయం పైకప్పులు లీకవుతున్నాయన్నారు. ఎక్కడాలేని విధంగా చదరపు అడుగుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రజాధనాన్ని భారీ స్థాయిలో దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. సుమారు 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని...చంద్రబాబు ప్రజాధనాన్ని ఇలా చేశారని టిడిపి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సచివాలయమా...జలపాతమా అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
బిజెపి నేతలు...కమెడియన్స్
ఏపీ బీజేపీ ప్రజాప్రతినిధులపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సెటైర్లు సంధించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆటలో బుడంకాయ్ల్లాగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన...బీజేపీ ఎమ్మెల్యేలు హీరో, విలన్ మధ్య కామెడీ యాక్టర్స్లా మారారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాని వైసీపీ...బీజేపీతో ఆటలు ఆడిస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు తీరుతో...మోడి,జగన్ కు వణుకు
ప్రజల జేబులకు ప్రధాని మోడీ చిల్లు పెట్టారని, ఆయనని సాగనంపాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు. ఏపీలో చంద్రబాబు స్విచ్ వేస్తే దేశంలో లైట్లు వెలుగుతాయని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు పనితీరుతో మోడీ, జగన్ వణికిపోతున్నారని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.