ఆ పేర్లు చెప్పడానికి భయమెందుకు, ఏపీలో లాలూ ప్రభుత్వం, బాబుకు అదే గతి: జీవీఎల్ హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ రాజకీయం వేడెక్కుతోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ విజయవాడలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభఇంచింది. ధర్మ పోరాట దీక్ష పేరుతో ఈ దాడులను బీజేపీ నేత రామ్ మాధవ్ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు రిలే దీక్షలు చేయనున్నారు. ఈ సందర్భంగా కన్నా, జీవీఎల్ తదితరులు మాట్లాడారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తక్కువ చేసి చూపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏటికేడు ఈ సంస్థ ఆస్తులు తగ్గించి చూపిస్తున్నారని మండిపడ్డారు. రూ.2వేల హాయ్లాండ్ను రూ.275 కోట్లు అంటున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసే కుట్ర జరుగుతోందన్నారు. హాయ్ లాండ్ పైన కన్నేసి ఆ సంస్థ యాజమాన్యంపై కేసు పెట్టారన్నారు.
రూ.500 కోట్లు ఉన్నాయని యనమలనే చెప్పారు
రూ.500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే స్వయంగా చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత కేవలం రూ.6 లక్షలే ఉన్నాయని మాట మార్చారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రయత్నం అన్నారు. విజయవాడలో రూ.30 కోట్లున్న ఆశ్తులను కేవలం రూ.11 కోట్లకే ఇచ్చారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
లాలూకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది
అగ్రిగోల్డ్ ఆస్తులు ఏటికేడు ఎందుకు తగ్గిపోతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు ప్రశ్నించారు. ఈ ఆస్తులను కొట్టేసే కుట్ర సాగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అంతటా లాలూచీ టెండర్లు జరుగుతున్నాయని, కానీ ఇక్కడ లాలూ ప్రభుత్వం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా పాలించారు, ఇక్కడ చంద్రబాబు అలాగే పాలిస్తున్నారన్నారు. లాలూ ప్రసాద్కు ఎలాంటి అనుభవం ఎదురైందో, చంద్రబాబుకు అదే అవుతుందని జోస్యం చెప్పారు.
ఆ పేర్లు చెప్పేందుకు అందుకే భయపడుతున్నారు
తెలుగుదేశం పార్టీ నేతలకు కాంట్రాక్టుల కంటే దందాల పైనే ఎక్కువగా అనుభవం ఉందని జీవీఎల్ మండిపడ్డారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయం కనిపిస్తోందని అన్నారు. అమరావతిలో రూ.1000 కోట్లకు పైగా సమీకరించారని, కానీ ఎక్కడి నుంచి సమీకరించారో చెప్పడం లేదని, ఆ పేరు చెప్పేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఆ పేరు ఎందుకు చెప్పడం లేదంటే ఈ ప్రభుత్వంలో లూటీ చేసిన వారే.. ఓ చేత్తో లూటీ చేసి, మరో చేత్తో పెట్టుబడులు పెడుతున్నారని, ఇదో మాఫియా రాజ్యమన్నారు.
చంద్రబాబుకు అందరితో లాలూచీ, భాగస్వామి
పారిశ్రామికవేత్తల పైన ఐటీ దాడులు జరిగితే అదేదో టీడీపీ నేతల పైనే జరిగినట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బందులు వచ్చినట్లుగా చంద్రబాబు చెబుతున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి చాలామందితో లాలూచీ ఉందని, భాగస్వామ్యం ఉందని, అందుకే వారి అక్రమాలకు అండగా నిలుస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారన్నారు.
బాలకృష్ణ కంటే ముందే జూ.ఎన్టీఆర్కు నారా బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్, భావోద్వేగం
గ్లోబల్ లీడర్ ఉన్న ఏపీలో ఎక్కువ అవినీతి
చెడ్డపేరు వచ్చినా అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలనే కక్కుర్తి టీడీపీ నేతల్లో కనిపిస్తోందని జీవీఎల్ ధ్వజమెత్తారు. మహా అయితే చెడ్డపేరు నాలుగు రోజులు ఉంటుందని, ఆ తర్వాత మరిచిపోతారని, సంపాదించుకుంటే దానిని తరతరాలు తినవచ్చునని భావిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు జరిగాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో లేని అవినీతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందని, అలాగే మన గ్లోబల్ లీడర్ ఉన్న ఏపీలో మరింత ఎక్కువగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే దోచుకుంటున్నారని ఆరోపించారు.
తెచ్చిన అప్పుకు లెక్క చెప్పండి
చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా టిట్లీ తుఫాను బాధిత ప్రాంతంలో ఉండి.. ఇక్కడ ఎందుకున్నాను రా బాబూ అని బాధపడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఏమైనా అంటే ఆయన కేంద్రాన్ని దూషిస్తున్నారని చెప్పారు. ప్రజలను దారి మళ్లించేందుకు తుఫాన్ రాజకీయం చేస్తున్నారన్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎందుకు ఖర్చు చేయడం లేదో చెప్పాలన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, వాటిని ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలని నిలదీశారు. ఆ తర్వాత కేంద్రాన్ని నిలదీయాలని చెప్పారు. అమరావతిలో భూములు దోచుకున్నట్లే అగ్రిగోల్డ్లోను దోచుకుంటున్నారన్నారు.