బిజెపి, టిడిపి మధ్య అగాథం: కయ్యానికి కాలు దువ్విన బిజెపి నేతలు
కడప: మిత్రపక్షాలైన బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. బిజెపిని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని బిజెపి నాయకులు సోము వీర్రాజు, కావూరి సాంబశివ రావు, శాంతారెడ్డి తదితరులు టిడిపిని హెచ్చరించారు.
మిత్రపక్షంగా తమను కలుపుకుని వెళ్లాలని కావూరి సాంబశివరావు టిడిపికి సూచించారు. టిడిపి పద్ధతి మారాలని ఆయన అన్నారు. జన్మభూమి కమిటీల్లో రాజకీయ జోక్యం కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని, ఇది మంచిది కాదని, జన్మభూమి కమిటీల్లో టిడిపికి చెందినవారికే పెద్ద పీట వేశారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రాజెక్టులను చేపడుతున్నారని, పేదలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని ఆయన అన్నారు.
రాజధాని భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు విమర్శించారు కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్తో టిడిపి నేతలు కోట్లకు పడగలెత్తారని శాంతారెడ్డి అన్నారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్యన ఉన్న మైత్రిని చెడగొట్టేందుకు మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సతీష్ బుధవారం నాడు ఆరోపించిన విషయం తెలిసిందే.
పది నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేని ఆయనకు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పదేళ్లుగా మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గం సమస్యలు ఎందుకు పట్టలేదని విమర్శించారు. టిడిపిపై కిందస్థాయి బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకు తాము ప్రాధాన్యత ఇవ్వమని, అసలు పట్టించుకోమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భిక్ష వల్లే బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ, పురందేశ్వరి, కావూరి సాంబశివరావులు సోనియా గాంధీ ఏజెంట్లని, ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని అన్నారు.
వారాల ఇళ్లలో భోజనాలు చేసిన కావూరి వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు ఈ ముగ్గురిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం కావడం వల్లనే బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాము ఊరుకుండిపోతున్నామన్నారు.