సీఎం జగన్ బీజేపీ మతం అస్త్రం : దేవాదాయ భూములు పంచుతున్నారు: తిప్పి కొట్టలేక వైసీపీ..!!
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ముందుగా ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తోంది. టీడీపీ నుండి అనేక మంది నేతలు తమతో టచ్ లో ఉండటంతో ఇక వైసీపీని విమర్శలతో లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగా..పలు సందర్భాల్లో మత పరమైన అంశాల్లో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తిరుమలలో ఆర్టీసి టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార విషయంలోనూ బీజేపీ నేతలు నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. తాజాగా దేవాదాయ భూములను పంచుతున్నారంటూ ఆరోపణలు మొదలు పెట్టారు. ఇక..ఇతర మత గురువులకు ప్రోత్సాహకాలు ఇవ్వటం పైన తప్పు బడుతున్నారు. కానీ, వీటిని తిప్పి కొట్టటంలో వైసీపీ వెనుకబడి ఉంది. టీడీపీ నేతలు అనేక రకాలుగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంటే..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం నేరుగా ముఖ్యమంత్రి పైనే విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా కన్నా చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఏపీ లో వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తోందో స్పష్టం చేస్తోంది.
ముఖ్యమంత్రి లక్ష్యంగా బీజేపీ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు చేసారు. ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి.. కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేశారని ఆరోపించారు. ఇసుక పాలసీకి సెప్టెంబర్ 5న ముహూర్తం పెట్టారన్నారు. కార్మికులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. వరదలు వస్తే జగన్ అమెరికాలో కూర్చున్నారని కన్నా ఆరోపించారు. ప్రజలు మంచి మార్పు కోరుకొని జగన్కు అవకాశం ఇచ్చారని కానీ ఆయన గత ఐదేళ్ల సంగతే మాట్లాడుతున్నారు కానీ.. ప్రస్తుతం ఏంటనేది చెప్పలేదన్నారు. జన్మభూమి కమిటీల పేరు మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొస్తున్నారని కన్నా విమర్శించారు. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థ అదని ఆరోపించారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని కన్నా విమర్శించారు. ఏపీ సీఎం జగన్వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలేనని విమర్శించారు. జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. చాలా త్వరగా పరిపాలనపై జగన్ పట్టు కోల్పోయారని కన్నా విమర్శించారు.
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారిచ్చారు..
పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారిచ్చారని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని కన్నా విమర్శించారు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదన్నారు. అవినీతిపరులను వదిలేసి రేషన్ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని కన్నా మండిపడ్డారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువమందిని రోడ్డున పడేశారన్నారు. రోజురోజుకు అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ 3 నెలల్లో మీ అవగాహనా రాహిత్యం ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుందని.. మత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కన్నా విమర్శించారు.
దేవాదాయ భూములు జగన్ పంచేస్తున్నారంటూ..
ఏపీలో దేవాదాయ భూములు ముఖ్యమంత్రి జగన్ పంచేస్తన్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. ఏపీలో 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసామని..భూములు అందుబాటులో లేని చోట దేవాదాయ భూముల గురించి పరిశీలన జరిగిందని చెబుతున్నారు. అదే విధంగా ఇతర మతాల్లోని పెద్దలకు ప్రోత్సహకాలు ఇవ్వటాన్ని బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. ఒక మతం కోసమే జగన్ పని చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గతంలో తిరుమలలో టిక్కెట్ల మీద అన్యమత ప్రచారం విషయంలోనూ తీవ్ర విమర్శలు చేసారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న మత పరమైన విమర్శలను వైసీపీ నేతలు సమర్ధంగా తిప్పి కొట్టలేక పోతున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీలోని కొందరు నేతలు జగన్ లక్ష్యంగా ఇవే రకమైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు బీజేపీ నేతలు పూర్తిగా మత పరంగానే జగన్ ను కార్నర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.