మిషన్ పార్క్ హయత్?: నిమ్మగడ్డతో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యభేటీ?..
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు రహస్యంగా భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. రాజ్యంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగుతూ.. ఉద్వాసనకు గురై.. ప్రస్తుతం చట్టపరంగా పోరాడుతోన్న ఓ అధికారితో బీజేపీ నేతలు భేటీ కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.
ఇసుక కొట్టేస్తే నో సీఐడీ..మహిళలను వేధిస్తోంటే నో సీఐడీ: బాలయ్య డైలాగులను పేల్చిన నారా లోకేష్
పార్క్ హయత్ హోటల్లో
నిమ్మగడ్డ రమేష్కుమార్, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లోనికి వెళ్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవే సీసీటీవీ ఫుటేజీ వీడియోలను ఓ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ప్రసారం చేసింది. ఈ నెల 13వ తేదీన వారు పార్క్ హయత్ హోటల్లో కలుసుకున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీ స్పష్టం చేస్తోంది.
సుజనా చౌదరి, కామినేని.. వారి వెంటే నిమ్మగడ్డ..
తొలుత సుజన చౌదరి, అనంతరం కామినేని శ్రీనివాస్ ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్ లోనికి వెళ్లడం, అక్కడి కారిడార్లో తిరుగాడటానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ నెల 13వ తేదీన ఉదయం 10:47 నిమిషాలకు తొలుత సుజనా చౌదరి హోటల్లోనికి ప్రవేశించడం, 11:23 నిమిషాలకు కామినేని శ్రీనివాస్ హోటల్లోనికి ప్రవేశించడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 20 నిమిషాల తరువాత నిమ్మగడ్డ రమేష్కుమార్ హోటల్లోనికి వెళ్లినట్లు తెలుస్తోంది.
సుమారు రెండు గంటల పాటు..
సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు వారంతా పార్క్ హయత్ హోటల్ ఎనిమిదో అంతస్తులలో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియరావట్లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేస్తోన్న తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా, పదవీ కాలం ముగియకముందే ఉద్వాసన పలకడానికి నిరసనగా ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.
న్యాయపోరాటం చేస్తోన్న సమయంలో..
ఈ విషయంలో హైకోర్టు నుంచి వెలువడిన తీర్పు నిమ్మగడ్డ రమేష్కుమార్కు అనుకూలంగా వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఆయనను ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించినా ఫలితం రాలేదు. స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టఅంగీకరించలేదు.
Recommended Video
తాను ప్రయత్నాలు తనవి అంటూ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హైకోర్టులో విచారణ దశలో ఉన్న సమయంలో సుజనా చౌదరి ఓ సంచలన ప్రకటన చేశారు. ఆయన కోసం తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నానని, అవి ఫలిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలి వెళ్లకుండా తాను కొన్ని ప్రయత్నాలు చేశానని, అవి ఫలించాయని, అదే తరహాలో నిమ్మగడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నిమ్మగడ్డను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేసిన వారిలో కామినేని శ్రీనివాస్ ఒకరు. ప్రస్తుతం ఆ ఇద్దరూ నిమ్మగడ్డను కలుసుకోవడం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది.