టీడీపీలో గూండాలు-తరిమి కొడతారు: ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ‘అమిత్ షా’పై దాడి
Recommended Video
అమరావతి/తిరుపతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ శ్రేణులు జరిపిన దాడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయ విమర్శలు వేడెక్కాయి. ఈ దాడి ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడికే రాష్ట్రంలో రక్షణ కల్పించలేకపోతున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు టీడీపీ అవినీతిమయమైందని విన్నాం కానీ, ఇప్పుడు గూండాలతో నిండిపోయిందని ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగిందని టీడీపీ మంత్రులు, నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలే గాయపడ్డారంటూ..
తిరుపతి ఘటనలో టీడీపీ కార్యకర్తలే గాయపడ్డారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే దాడి చేశారని చెప్పారు. అమిత్ షాపై అసలు దాడే జరగనప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్నారు.
అంతుచూస్తామంటారా?
ఉద్యమం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని సోమిరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లదాడి దురదృష్టకరమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే అంతు చూస్తామంటూ ఎంపీ జీవీఎల్ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు..? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబుకు కాదు.. జీవీఎల్కే త్వరలో చుక్కలు కనిపిస్తాయన్నారు. పన్నెండు కేసులున్నా జగన్ జోలికెళ్లరా..? అంటూ నిలదీశారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. మోడీ, అమిత్షాకు ప్రజలు బుద్ధిచెప్పాలని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
తిరుమలలో అమిత్ షాకు చేదు అనుభవం: ‘గో బ్యాక్' అంటూ టీడీపీ, కాన్వాయ్పై దాడి, ఉద్రిక్తత
అనేక శక్తులు.. చినరాజప్ప వార్నింగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపినట్లు వార్తలు వస్తున్నాయని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. శుక్రవారం షా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్ను ఆందోళనకారులు అడ్డుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంపై మంత్రి స్పందించారు. అలిపిరి ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు. ఏది ఏమైనా హోదా కోసం ఏపీలో ప్రశాంతమైన ఉద్యమం జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయన్నారు. అందరూ సయంమనం పాటించాలని చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కల్పించిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. షా కాన్వాయ్పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
ఇలాగే తరిమికొడతారు..
ఏపీ ప్రజలను మోసం చేశారు కాబట్టే తిరుపతిలో అమిత్ షాపై దాడి చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. అమిత్ షాపై జరిగింది చిన్నదాడే అని .. ఇంకా ముందుందని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మోసాన్ని భరించలేకే కర్ణాటకలో కాంగ్రెస్కు చంద్రబాబు మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్, మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని వీహెచ్ ఆరోపించారు. జేడీఎస్కు ఓటు వేయడమంటే బీజేపీకి వేసినట్టే అని తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని అందుకే రైతుబంధు కార్యక్రమానికి మమతా, స్టాలిన్ రాలేదని వీహెచ్ అన్నారు.
షా కాన్వాయ్పై దాడి: చంద్రబాబు హెచ్చరిక, ఆయన నైజమే అదంటూ సోము ఫైర్
టీడీపీలో అవినీతే కాదు.. గూండాలు కూడా
అమిత్ షాపై దాడికి పాల్పడటం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తిరుపతికి వచ్చే అతిథులను గౌరవించాలని హితవు పలికారు. రాజకీయ దురుద్దేశంతోనే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీపై మండిపడ్డారు. టీడీపీ ఇప్పటి వరకు అవినీతిలో కూరుకుపోయిందనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు గూండాల మయమైందని తెలుస్తోందని విష్ణుకుమార్ రాజు అన్నారు.
ఏపీని దేశం చీదరించుకునేలా చేశారు
టీడీపీ చేసిన పనికి ఏపీని దేశం మొత్తం చీదరించుకుంటోందని విష్ణకుమార్ రాజు అన్నారు. ఓ వైపు దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఏ దాడులు చేసిన పైనవాళ్లు చూసుకుంటారనే ఉద్దేశంతోనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. టీడీపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. చంద్రబాబు చర్యలు తీసుకుంటామంటారు కానీ, చేసేదేమీ ఉండదని అన్నారు.
ఏపీ ప్రజలు తలదించుకునేలా.. బాబుదే బాధ్యత
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. పబ్లిక్ కాదని, టీడీపీ వాళ్లే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈరోజు సాయంత్రానికిల్లా దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. వ్యక్తిగత దాడులకు పాల్పడి టీడీపీ ఏం చెప్పదల్చుకుంటోందని అన్నారు. ఏపీ ప్రజలు తలదించుకునేలా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమిత్ షాపై దాడిని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.