జగన్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ .. బీజేపీ నేతలు మాటల దాడిని పెంచింది అందుకే
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై ఫోకస్ చేసిన బీజేపీ ఇప్పుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేస్తోంది . ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న వరుస సంఘటనలు ఈ విషయానికి బలాన్నిస్తున్నాయి. బెజేపీ నేతల మాటల దాడి ఆ విషయాన్నీ తేటతెల్లం చేస్తుంది. ఒకర్ని మించి ఒకరు జగన్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు.బిజెపి నాయకత్వం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.
ఆ భేటీలో ఏపీ సీఎం అసహనం..! అవాక్కయిన అదికార గణం, అమాత్యులు..!!
వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ నాయకులు ... విమర్శల జల్లు కురిపిస్తున్న నేతలు
ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ శాసనసభ్యుల్లో అత్యధికులను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నేతలు భావించారు. అందుకు ఇప్పటికే మంతనాలు కూడా జరిపారు. అయితే, జగన్ నిర్ణయం వల్ల వారు బిజెపిలో చేరడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పార్టీ మారినా పదవికి రాజీనామా చేసి వెళ్లాలని, అలా చేయకపోతే వేటు వేయాలని జగన్ స్పీకర్ ను కోరారు. ఇక దీంతో ప్రజాప్రతినిధులు బిజెపిలోకి వెళ్ళటానికి ఆసక్తితో ఉన్నా సంశయంలో ఉన్నారు. ఇదంతా జగన్ వల్లే అని భావించి బీజేపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. తమ వ్యూహంలో భాగంగా బిజెపి నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్ తదితరులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
జగన్ పై విరుచుకుపడుతున్న కన్నా .. వైసీపీ పాలన అరాచకమని విమర్శలు
టీడీపి అరాచక, పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే వైసిపి పాలన కూడా అదే అరాచక మార్గంలో నడుస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. ఇలా అయితే టీడీపీకి పట్టిన గతే వైసీపీ కి పడుతుందని విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతను కన్నా లక్ష్మినారాయణ తొందరపాటు చర్యగా అభివర్ణించారు . రాష్ట్రమంతా పోలీసు రాజ్యం నడుస్తోందని, గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలపై, నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఇక దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. అంతే కాదు పురంధేశ్వరి సైతం మరింత తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు . ఆమె వ్యాఖ్యలు చూస్తే జగన్ కు ముప్పు తప్పదని అనిపిస్తోంది.
తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పురంధరేశ్వరి , మాధవ్ తదితర నేతలు .. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ జగన్
ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసులు అటువంటి ఆదేశాలు ఇవ్వడం సరి కాదని ఆమె అన్నారు. టీడీపీ కుల రాజకీయాలు చేస్తే వైసీపీ మత రాజకీయాలు చేస్తుందని పురంధరేశ్వరి మండిపడ్డారు. జగన్ ఏపీ ప్రజలను ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ఆనే మండిపడ్డారు. విశాఖ చర్చిలకు భద్రత కల్పించిన విషయంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రశాంతమైన విశాఖలో చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఎవరి మెప్పు కోసం ఆ పని చేస్తున్నారని ఆయన అడిగారు. ఎబివీపీ విద్యార్థులకు ముసుగులు వేసి క్రిమినల్స్ మాదిరిగా మీడియా ముందు ప్రవేశపెట్టారని, అది సరి కాదని బిజెవైఎం రాష్ట్రాధ్యక్షుడు రమేశ్ నాయుడు, బీజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.ఇలా బీజేపీ నేతలు మాటల దాడిని పెంచారు. పాలక పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ పై అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయితే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ జగన్ అన్న ధోరణిలోనే బీజేపీ నేతలు మాట్లాడుతుండటం గమనార్హం .