పవన్ కళ్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొదట లేఖ రాసింది బీజేపీనేనని ఆయన అన్నారు.
ఇసుక సమస్యపై గవర్నర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీనేనని ఆయన తెలిపారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని విష్ణవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాన్ తో వేదికను పంచుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.
కష్టాలు మీరే తీర్చండి.. పవన్కు కొత్త బాధ్యత.. రండి అంటూ కన్నాకు ఫోన్, తెలంగాణ లెక్కనే!
ఇది ఇలావుంటే, మరో బీజేపీ నేత పురిహెళ్ల రఘురాం టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ కూడా మునిగే నావ లాంటిదని జోస్యం చెప్పారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో ఉందన్నారు. ఏపీలో దాదాపు గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు.
అన్ని పార్టీల అగ్రనేతలకు పవన్ కళ్యాణ్ పిలుపు
ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్.. అన్ని పార్టీల అగ్ర నాయకులతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. మొదట ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ఏపీ సీపీఎం కార్యదర్శ మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, లోక్సత్తా అధ్యక్షుడు డివివిఎస్ వర్మ, బీఎస్పీ అధ్యక్షుడు సంపత్ రావుతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ వివరించారు. పవన్ ఆహ్వానానికి లక్ష్మీనారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.