సింగపూర్కు వెళ్లి మోడీని అంటావా: బాబుపై హరిబాబు, 'ఏపీకి కేంద్రం సాయం'పై బుక్
అమరావతి: ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు అన్నింటిని ప్యాకేజీ ద్వారా ఇవ్వాలనుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం అన్నారు. 'ఏపీకి కేంద్రం సాయం' పుస్తకాన్ని కంభంపాటి ఆవిష్కరించారు. దీనిని బహిరంగ లేఖగా పేర్కొన్నారు.
'కేంద్రానికి లెక్కలు చెప్పొద్దా? చంద్రబాబుకు జేపీ అనుకూలంగా మాట్లాడటమా?'
గతంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని హర్షిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ విషయాన్ని ఆయన ప్రజలకు వివరించాల్సి ఉంటుందన్నారు.
కొంతమందికి తెలియక ప్రచారం
కొంతమంది తెలియక బీజేపీపై లేని ప్రచారం చేస్తున్నారని కంభంపాటి హరిబాబు అన్నారు. కానీ ప్యాకేజీ ద్వారా ఏపీకి సాయం చేయాలని కేంద్రం భావించిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తాము ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా ఇస్తే
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేవలం రూ.15వేల కోట్ల నుంచి 16వేల కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని కంభంపాటి హరిబాబు చెప్పారు. 2015-16కు సంబంధించి కేంద్రం నుంచి రూ.9,487 కోట్లు ఇచ్చారన్నారు. 2016-17కు సంబంధించి రూ.17,242 కోట్లు ఇచ్చామన్నారు.
ఏపీ నుంచి ప్రాజెక్టులు తరలిపోతున్నాయనేది అవాస్తవం
ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక లోటును భర్తీ చేయాలని తాము భావించామని కంభంపాటి హరిబాబు చెప్పారు. ప్రాజెక్టులు ఏపీ నుంచి తరలిపోతున్నాయని టీడీపీ నేత తోట నర్సింహులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు.
సింగపూర్ పర్యటనలో ప్రధానిని విమర్శిస్తారా?
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి నష్టమని చంద్రబాబు నాయుడు గుర్తించాలని కంభంపాటి సూచించారు. అయినా, కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించినంత మాత్రాన ఏపీకి సాయం ఆగదని చెప్పారు. ఏపీకి సరైన సాయం చేస్తామని చెబుతుంటే వినకపోడవం విడ్డూరమన్నారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీని విమర్శించడం విచారకరమన్నారు.