ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది, బిజెపితో టిడిపి కటీఫ్: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
కర్నూల్: ఎన్నికలు వస్తున్నందునే బిజెపి రాయలసీమ డిక్లరేషన్ను తెరమీదికి తెచ్చిందని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి చెప్పారు. ఇంతకాలంపాటు బిజెపి రాయలసీమ సమస్యల గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపి బిజెపితో తెగదెంపులు చేసుకొంటుందనే ఉద్దేశ్యంతోనే రాయలసీమ డిక్లరేషన్ను తెరమీదికి తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయలసీమ డిక్లరేషన్ అంశాన్ని బిజెపి తెరమీదికి తెచ్చింది.రాయలసీమ అంశాన్ని బిజెపి తెరమీదికి తీసుకురావడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పర్చేందుకే అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఈ తరుణంలో బిజెపి రాయలసీమ డిక్లరేషన్ పట్ల టిడిపి నేతలు కూడ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాజకీయంగా ఏపీ లో సమీకరణాలు మారే అవకాశం ఉన్నందున బిజెపి రాయలసీమ డిక్లరేషన్ తెచ్చిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఓ తెలుగు న్యూస్చానెల్తో మాట్లాడారు.
ఇన్నేళ్ళు రాయలసీమ బిజెపికి ఎందుకు గుర్తులేదు
రాయలసీమకు అన్యాయం జరిగిందని బిజెపి నేతలు ఇవాళ మాట్లాడుతున్నారని, ఇంత కాలం ఎందుకు బిజెపి నేతల నోరు మూగపోయిందని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి రాయలసీమ డిక్లరేషన్ను తెర మీదికి తెచ్చిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాయలసీమ డిక్లరేషన్ను తీసుకురావడం ఈ సంకేతాలను ఇస్తోందన్నారు.
రాయలసీమ డిక్లరేషన్కు కారణమిదే
రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపికి, బిజెపికి మధ్య అగాధం పెరుగుతోందని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఆ తరుణంలో బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకొనే అవకాశం ఉందని బిజెపి భావిస్తుందన్నారు. ఈ తరుణంలోనే స్వంతంగా తమ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో రాయలసీమ డిక్లరేషన్ను బిజెపి తెరమీదికి తెచ్చిందని సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.
మేం అధికారంలోకి వస్తే పరిస్థితి వేరుగా ఉండేది
మేం అధికారంలోకి వస్తే పరిస్థితి మరోలా ఉండేదని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాష్ట్రానికి ఏం కావాలనే విషయాన్ని తాము విభజన చట్టంలో పొందు పర్చామని ఆయన చెప్పారు.2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం జరిగేదన్నారు.
బిజెపి గ్రాఫ్ పడిపోతోంది
ఏపీ రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పడిపోతోందన్నారు. వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకోవాలని చూస్తోందనే సంకేతాలు కన్పిస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయం కారణంగా ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందన్నారు. వైసీపీ బిజెపిల మధ్య పొత్తు కోసం తాపత్రయం కన్పిస్తోందని సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రజల కోసం తమ పార్టీ చేస్తున్న కృషి కారణంగా ప్రజలు తమ పార్టీ పట్ల సానుభూతిని చూపుతున్నారని సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.