జనసేన 'దేవ్' ఆయనకు బంధువే: గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగారట?
హైదరాబాద్: జనసేన పార్టీ వ్యూహకర్తగా నియమించబడ్డ వాసు'దేవ్' గతంలో నిజంగానే స్ట్రాటజిస్టుగా పనిచేశారా?.. గతంలొ బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన ఆయన వ్యూహకర్తగా ఎప్పుడు మారారు?.. ఇవే ప్రశ్నలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ్ ను పరిచయం చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు.. వాస్తవాలకు పొంతన కుదరడం లేదని అంటున్నారు.
దేవ్ పొలిటికల్ నేపథ్యం:
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల్ బస్తీ ప్రాంతానికి చెందిన దేవ్ గతంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో డిసెంబర్ 23,2013న ఒక విద్యావేత్తగా పార్టీలో చేరినట్టు చెబుతున్నారు. చేరడమే కాదు, సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ టికెట్ ఆశించారని కూడా చెబుతున్నారు. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా సనత్ నగర్ టికెట్ టీడీపికే కేటాయించడంతో దేవ్ ప్రయత్నాలు ఫలించలేదు.
30మంది టీమ్..:
దేవ్ గతంలో బీజేపీ అధికారిక ప్రతినిధిగా టీవి చర్చా కార్యక్రమాల్లోనూ కనిపించాడని చెబుతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల దాకా కనిపించని ఆయన.. ఇప్పుడు 'రాజకీయ వ్యూహకర్త'గా కొత్త అవతారం ఎత్తాడని అంటున్నారు. ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని సంప్రదించగా.. దేవ్ విషయం తనకు అంతగా గుర్తులేదని చెప్పడం గమనార్హం.
జనసేన మీడియా సమావేశంలో తన గురించి పరిచయం చేసుకున్న దేవ్.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలు రచించినట్టు, సర్వేలు చేయించినట్టు చెప్పారు. అంతేకాదు 30మంది టీమ్ తో సొంతంగా ఓ రాజకీయ సంబంధిత సంస్థను నడుపుతున్నట్టు వెల్లడించారు.
ఆయనకు బంధువే..:
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు దేవ్ దగ్గరి బంధువని సమాచారం. ఇదే విషయమై రాజనరసింహను జాతీయ మీడియా సంప్రదించగా ఆయన కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన తన బంధువే అని చెప్పారు. అంతేకాదు, తనకు తెలిసినంతవరకు దేవ్ ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్నాడని, వేరే ఏ పార్టీలోనూ చేరలేదని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ దేవ్ ను పరిచయం చేసిన సమయంలో.. ఆయన తనకు తెలుగు అంతగా రాదని చెప్పారు. కానీ వాస్తవానికి తెలుగు ఆయన బాగా మాట్లాడగలరని, గతంలో బీజేపీ తరుపున తెలుగు టీవి చానెళ్లలో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాడని అంటున్నారు.
కాంటాక్ట్ నంబర్ కూడా లేదట..:
దేవ్ తన వ్యక్తిగత సమాచారం ఏది జనసేనతో పంచుకోలేదని తెలుస్తోంది. ఆయన కాంటాక్ట్ నంబర్ కోసం జనసేన కార్యాలయాన్ని సంప్రదించగా.. ఆ పార్టీ మీడియా ఇన్-చార్జి హరిప్రసాద్ తమ వద్ద ఆ సమాచారం లేదన్నారు.'దేవ్ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు. ప్రతీరోజూ ఉదయాన్నే ఆఫీసుకు మాత్రం వస్తారు' అని ఆయన వెల్లడించారు.