బిజెపిని ప్రతిపక్షంలా చూస్తోంది....అడుగడుగునా అడ్డంకులే...టిడిపిపై మంత్రి మాణిక్యాలరావు మళ్లీ ఫైర్
పశ్చిమగోదావరి: దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు మరోసారి టిడిపి పై ఫైర్ అయ్యారు. టిడిపి తమని ప్రతిపక్షంలా చూస్తోందని, చేస్తున్న పనులు అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని ఎపి దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా చూస్తోందని, చేస్తున్న పనులను అడుగడుగునా అడ్డుకుంటోందని మండిపడ్డారు. సీఎం జీవో విడుదల చేసినా ఇక్కడ పనులు జరగనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రమంతటా వైసిపి ప్రతిపక్షం...ఇక్కడ మాత్రం బిజెపి..
రాష్ట్రమంతటా వైసీపీని ప్రతిపక్షంగా చూస్తుంటే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం నాయకుల వింత వైఖరితో తమను ప్రతిపక్ష పార్టీగా చూస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. సీఎం చంద్రబాబు 2016లో విడుదల చేసిన 233 జీవో ద్వారా తమ నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
పనులు నిలిపేశారు...అందుకే ఇలా...
ఈ అభివృద్ది పనులు జరిపేందుకు జిల్లా పరిషత్లో తీర్మానం చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కాలంగా దీనిని నిలుపుదల చేశారని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. వెంకట్రామన్నగూడెం, రామన్నగూడెం గ్రామాల్లో జరిగిన జన్మభూమిలో తనను నిలదీయాలంటూ పిలుపునివ్వడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆ బాధను భరించలేక తాను ఇప్పుడు ఇలా బైటపడాల్సి వచ్చిందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.
దిద్దుబాటు చెయ్యాలి...లేకపోతే...హెచ్చరిక
ఇక్కడ జరుగుతున్నవాస్తవ విషయాలను టీడీపీ అధిష్ఠానం తెలుసుకుని దిద్దుబాటు చర్య చేపట్టాలని మంత్రి సూచించారు. ఇకపై వారం వారం మీడియా ముందుకు వచ్చి ఏ పని ఎందుకు ఆగిందో చెబుతానని హెచ్చరించారు.
Recommended Video
ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్...అయితే ఏంటి?...
తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ తనను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని కామెంట్ చేస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. అవును నేను ఫొటోగ్రాఫర్గానే వచ్చాను. పుట్టుకతో కోటీశ్వరుడిని కాదు. ప్లాట్ఫారంపై ఆగి టీ తాగుతాను. స్టార్ హోటల్ అంటే నాకు తెలియదు...అయితే అందులో తప్పేంటని ప్రశ్నించారు మంత్రి మాణిక్యాలరావు.