రాయలసీమ యువత కోసం బాలకృష్ణ కృషి: బిజెపి మంత్రి ప్రశంసలు
హైదరాబాద్: రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కృషి చేస్తున్నారని మంత్రి మాణిక్యాల రావు బుధవారం నాడు అన్నారు. సచివాలయంలో మంత్రిని బాలయ్య కలిశారు.
అనంతపురంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని మంత్రి మాణిక్యాల రావును బాలకృష్ణ కోరారు. అలాగే, లేపాక్షి ఉత్సవాలను వైభవంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... లేపాక్షి నంది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 27, 28 తేదీలలో ఉత్సవాలని నిర్వహించాలనుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించాక తేదీలు ఖరారు చేస్తామన్నారు. అంతర్జాతీయస్థాయిని ఆకర్షించేలా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
అనంతరం మంత్రి మాణిక్యాల రావ మాట్లాడుతూ... బాలకృష్ణ రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. లేపాక్షి శిల్పకళా సంపదను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఉత్సవాలు అన్నారు. ఉత్సవాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ పైన జూపూడి మండిపాటు
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించలేదని, అందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలోని 16వేల గ్రామాల నుంచి మట్టిని సేకరించి పంపే కాంగ్రెస్ పార్టీ మట్టి సత్యాగ్రహం పైన టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు.
పుట్టమట్టి కాదు, బొందల మట్టి సేకరించి మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను ఎప్పుడో ప్రజలు బొందపెట్టారన్నారు. ఈ విషయాన్ని సోనియాకు మొరపెట్టుకోవాలన్నారు. రాజధానికి పవిత్రభావంతో ప్రజలు మట్టి సేకరిస్తే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం దారుణమన్నారు.