ఎవరి మెప్పుకోసం రాయపాటి అలా మాట్లాడారు: బీజేపీ ఎమ్మెల్యే నిలదీత
అమరావతి: ప్రధాని నరేంద్రమోడీపై నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు మండి పడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయపాటి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.
ఆంధ్రుల శాపం వల్లే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిందని అనడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని మెప్పించడానికి రాయపాటి బీజేపీని విమర్శిస్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు.
ఎవరు ఎన్ని మాటలన్నా తెలుగుదేశం-బీజేపీల మధ్య మైత్రిబంధం కొనసాగుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు స్పష్టం చేశారు.
వైఎస్పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి చెందాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాలూరు మండలం కూర్మరాజుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంలో పరమేశ్వర్ మాట్లాడుతూ వైఎస్ హాయంలో రాజన్నదొర ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలోనే తమ గ్రామాభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజన్న దొరతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు.