సీఎం చంద్రబాబు అందులో సూపర్ సక్సెస్...ఇందులో మాత్రం అట్టర్ ఫెయిల్:బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
అమరావతి:ఎపి అసెంబ్లీలో బిజెపి-టిడిపి నేతల మాటల యుద్దం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు సందర్భాల్లో ముఖాముఖి వాగ్వాదాలతో తలపడుతున్న సిఎం చంద్రబాబు-బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య మంగళవారం సైతం అదే ఘట్టం చోటుచేసుకుంది.
మోడీకి సవాల్: పెట్రోల్, డీజిల్పై చంద్రబాబు శుభవార్త, బీజేపీ నేత ప్రశంసలు
దోమలపై దండయాత్ర గురించి సోమవారం వ్యంగాస్త్రాలతో అసెంబ్లీ లో నవ్వులు పూయించిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా మరోసారి అదే సమస్యపై గళం ఎత్తి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేశారు. బిజెపిపై నిందలు ప్రచారం చేయడంలో సూపర్ హిట్ అయిన సిఎం చంద్రబాబు...దోమలపై దండయాత్ర విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు. వివరాల్లోకి వెళితే...
సిఎం...అందులో సక్సెస్
అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మంగళవారం సభలో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..."కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైరల్ వ్యాధులు మరింత ఎక్కువయ్యాయి. సిఎం చంద్రబాబు ఎప్పుడూ సక్సెస్ అవ్వాలనే నేను కోరుకుంటాను అధ్యక్షా...బీజేపీ పైన లేనిపోని నిందలువేసి రాష్ట్ర ప్రజానికానికి.. మాపైన బురదజల్లే కార్యక్రమంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారు...మరి అక్కడ సక్సెస్ అయినప్పుడు దోమలపై దండయాత్రలో కూడా సక్సెస్ అయితే చాలా సంతోషిస్తాను అధ్యక్షా...అసలు ఈ దండయాత్ర ఎందుకు ఫెయిల్ అయ్యిందో..?...ఎక్కడ లోపం వచ్చిందో తెలియట్లేదు గానీ అధ్యక్షా...ఇది మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది" అని చెప్పారు.
Recommended Video
ఇందులో...ఫెయిల్
ఇదే విషయమై ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ..." మళ్లీ మళ్లీ చెబుతున్నా అధ్యక్షా...ఈ విషయంలో ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారని చెప్పాల్సి వస్తోంది. ఒక్కోసారి ఓడిపోతూ ఉంటాం...దండయాత్రలు చేసినప్పుడు అన్ని సార్లూ గెలవాలనీ ఏమీ లేదు...అందుకే మళ్లీ ఇంకోసారి దోమలపై డిఫరెంట్ దండయాత్ర చేస్తే తప్పనిసరిగా ఇది కంట్రోల్ అయ్యే అవకాశముంది"...అన్నారు.
కెజిహెచ్...రావాల్సిందే
అనంతరం కెజిహెచ్ లో సమస్యల పరిష్కారం విషయమై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..."సీఎం చంద్రబాబు, మంత్రి యనమల విశాఖలోని కేజీహెచ్ ను వారానికి ఒకసారి విజిట్ చేయాల్సిన అవసరముంది...కేజీహెచ్ను గనుక సరైన రీతిలో చేయలేకపోతే ఈ ప్రభుత్వంలోని హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు" అన్నారు.
సిఎం వద్దే...ఆ శాఖ
బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్య,ఆరోగ్య శాఖ కు రాజీనామా చేసిన అనంతరం ఆ శాఖ సిఎం చంద్రబాబు వద్దే ఉన్న సంగతి తెలిసిందే . ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు ప్రబలడం ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈక్రమంలో పలు దఫాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తీవ్రంగా మందలించిన సిఎం చంద్రబాబు 3 రోజుల క్రితం అధికారులను ఉద్దేశించి సోమవారానికల్లా మార్పులు రాకపోతే అందరిని స్పాట్ లోనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ సమస్య తీవ్రంగా ఉన్న విశాఖ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాల కొండయ్య పర్యటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దోమల సమస్యపై బిజెపి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.