చంద్రబాబుకు దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఛాలెంజ్
విజయవాడ:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఛాలెంజ్ విసిరారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగించి...ఉద్యోగాలను అమ్ముకుందని మాధవ్ ఆరోపించారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందని, అయినప్పటికీ టీడీపీ స్వార్థ రాజకీయంతో బీజేపీపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టబడి ఉందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను విస్మరించిందని ఢిల్లీలో టీడీపీ ఎంపీ తోట నరసింహం విమర్శించారు. కేంద్ర మంత్రుల మాటలకు.. అధికారుల మాటలకు పొంతన లేకుండా ఉందని, రైల్వేజోన్ సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలంటూ ఉత్తరాంధ్రకు సంబంధించిన మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఢిల్లీ బాట పట్టారని, పార్లమెంట్లో పోరాటం చేస్తున్న ఎంపీలకు మద్దతు తెలిపారని చెప్పారు.
విశాఖకు రైల్వే జోన్ అంశం అనే నినాదం...నినాదంగానే ఉండిపోయిందని, కార్యచరణ కాలేదని, కేంద్రం పట్టించుకోవడంలేదని ఎంపి విమర్శించారు. దీని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని, ప్రజా సంఘాలు రోడ్డుమీదకు వచ్చి పోరాటాలు చేస్తున్నాయని, ఎన్నిరకాలుగా చేసినా, కేంద్రం రాజకీయ దృక్ఫధంతో కాలయాపన చేస్తోందని తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రైల్వే జోన్ ఇవ్వడంలేదని ఎంపీ విమర్శించారు.
ఎపిలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకున్నారంటే...రాష్ట్రానికి ఏమీ చేయకూడదనే వారు నిర్ణయించుకున్నారని అర్థమవుతోందన్నారు. దీనిపై నిన్న పార్లమెంట్లో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తూ.. వాకౌట్ చేశామని తోట నరసింహం తెలిపారు. తాము రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని, తమ పోరాటాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదని... దీనికి కేంద్రం సిగ్గుపడాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి ఏపీకి న్యాయం చేయాలని తోట నరసింహం డిమాండ్ చేశారు.