బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడిది?...ఏదో జరిగే ఉంటుంది:బిజెపి ఎమ్మెల్సీ మాధవ్
Recommended Video
విజయవాడ :టిటిడి పవిత్రతను టీడీపీ మంటగలుపుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. మంగళవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ నాయకులు, అధికారులు వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులును విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగేవుంటుందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని మాధవ్ ధ్వజమెత్తారు. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని మాధవ్ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆభరణాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆభరణాలన్నీ బహిర్గతం చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని...అయితే ఆయనే స్వయంగా వాటిని చూసి చెబుతన్నారా?...లేదా ఇలా చెప్పమంటూ ఎవరైనా ఆయనను ప్రభావితం చేస్తున్నారా అనేది సందేహంగా ఉందన్నారు. బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం నుంచి వివరణ కోరాల్సిన అవసరం ఉందనేది తన అభిప్రాయమన్నారు. అలాచేస్తే ఆ వజ్రం ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహం తీరిపోతుందని చెప్పారు.
టిటిడి ఛైర్మన్ గా అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తిని నియమించారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడిలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని...అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు.
ఇదిలావుంటే...టీటీడీలో పదవీ విరమణ పంచాయితీ పెద్దల వద్దకు చేరింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తమని పదవి నుంచి వయో పరిమితి పేరిట అర్థాంతరంగా తొలగించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాదు తనకు న్యాయం జరిగేవరకు వెనక్కి తగ్గేది లేదని, టీటీడీ వైఖరికి నిరసనగా ఆయన ఆమరణ దీక్ష చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారట. మరోవైపు టీటీడీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతిలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు పాలకమండలి చైర్మన్తో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ హాజరు కానున్నట్లు సమాచారం.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిపై వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని భూమన ఆరోపించారు. చంద్రబాబు ఉచ్చులో పడి అర్చకులు గొడవలు పడుతున్నారని అన్నారు. బాబు జీవితమంతా కులాల మధ్య వైరాన్ని సృష్టించడమేనని విమర్శించారు. ప్రశ్నించే వారిపై క్షక్ష సాధింపులకు గురిచేస్తున్నారని, రమణ దీక్షితులు ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. తన అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జీవోలు తెస్తున్నారన్నారు.
టిటిడిలో వారసత్వ అర్చకత్వం ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతోందని తెలిపారు. అక్కడ నాలుగు వారసత్వ కుటుంబాలకు ఎంతో విశిష్టత ఉందని...ఈ కుటుంబాలు వేలాది ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నాయన్నారు. తరతరాల సంప్రదాయాలపై ఎవ్వరికీ పెత్తనం ఉండరాదని అభిప్రాయపడ్డారు. అన్యమతస్థుల పాలనకాలంలో కూడా స్వామివారి ఆచార వ్యవహారాల్లో ఎన్నడూ తలదూర్చలేదని భూమన గుర్తు చేశారు. అమరావతిలో బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు తిరుమలలో స్వామివారి ఆచారాల్లో తలదూరుస్తున్నారన్నారు. హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారని భూమన ధ్వజమెత్తారు.