చంద్రబాబూ! క్వార్టర్స్ నిర్మాణానికి రూ.744 కోట్లు, అవి భూగర్భంలో ఉన్నాయా?: బీజేపీ
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ బుధవారం అన్నారు. అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ వీడియో క్లిప్స్ శాసన సభలో పెట్టడం తప్పని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు లేఖ రాస్తే లేఖ ద్వారా స్పందించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై తాము మాట్లాడితే ఏదో రాష్ట్ర ప్రజలపై దాడి జరిగినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.744 కోట్లు ఖర్చు చేశామని యూసీలు పంపినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారని, మరి ఆ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని మాధవ్ నిలదీశారు. అవి అమరావతిలో ఉన్నాయా లేక భూగర్భంలో ఉన్నాయా అని నిలదీశారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అఖిల పక్షానికి మూడు ముఖ్య పార్టీలు హాజరు కాలేదంటే ప్రభుత్వంపై విశ్వాసం లేదని అర్థమని చెప్పారు. అఖిలపక్షానికి వెళ్లిన వామపక్షాలు కూడా విమర్శలు చేశాయన్నారు.