మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం ఇదే.. ఏపీ బీజేపీ నేతల కీలక ప్రకటన..
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం జగన్ స్వయంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ చేపట్టగా.. 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో మండలి రద్దు బిల్లు 133 ఓట్లుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి కావడంతో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
కేంద్రం ఏం చెయ్యబోతోంది?
ఏపీ శాసన మండలి రద్దుకు కేంద్రం సరేనంటుందా? పార్లమెంట్ ఉభయసభల్లో దీనికి ఆమోదం లభిస్తుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండొచ్చనేదానిపై ఏపీ బీజేపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మండళ్ల రద్దు లేదా ఏర్పాటు లేదా పునరుద్ధరణకు సంబంధించి రాష్ట్రాలు పంపే బిల్లుల్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించి తిరిగిపంపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొంతకాలంగా మండళ్ల ఏర్పాటుకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు పంపిన బిల్లుల్ని కేంద్రం కోల్డ్ స్టోరేజీలో ఉంచిన నేపథ్యంలో ఏపీ విషయంలో ఏం జరుగుతుందనే టెన్షన్ పెరుగుతోంది.
బీజేపీ నేతలు ఏం చెప్పారంటే..
ఏపీలో శాసన మండలి రద్దు కావడం దురదష్టకరమని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్, వైసీపీ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరించాయని, ప్రతిపక్షపార్టీల అభిప్రాయాలను కూడా తీసుకోకపోవడం దారుణమన్నారు. మండలి అవసరమే లేదన్నట్లు వైసీపీ చేస్తున్న వాదనను కూడా మాధవ్ తప్పుపట్టారు. నిర్మాణాత్మక చర్చలకు మండలి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.
లాంఛనమే..
మండలి రద్దుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో దానికి ఢిల్లీకి పంపుతారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. ‘‘అసెంబ్లీ ఆమోదం పొందిన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లోనూ ఆమోదం పొందడం లాంఛనమే. దీనికి ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండబోవు''అని స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
ఢిల్లీకి ఎప్పుడు పంపుతారు?
మరో మూడ్రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ మండలి రద్దుకు సంబంధించిన బిల్లును ఢిల్లీకి పంపేందుకు జగన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత సెషన్స్ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్నాయి. బడ్జెట్ పై చర్చల వేడి తగ్గిన వెంటనే ఏపీ మండలి రద్దు బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముంది.