మీరు తెమ్మంటనే మోడీ నీరు-మట్టి తెచ్చారు, అమరావతి ప్లాన్ మార్చాలి: టీడీపీకి బీజేపీ షాక్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే ప్రధాని నరేంద్ర మోడీ నాడు మట్టి, నీరు తెచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మంగళవారం చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ను మార్చాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
శాసనమండలిలో రాజధాని అభివృద్ధిపై చర్చ సందర్భంగా మాట్లాడిన మాధవ్ మాట్లాడారు. డిజైన్లు పూర్తి కాకుండా డీపీఆర్ ఎలా పంపుతారని ప్రశ్నించారు. రాజధానిని అప్పులతో నిర్మించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
తుంగలో తొక్కుతోంది
ఎన్జీటీ తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మాధవ్ మండిపడ్డారు. రాజధానిలోని ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జీటీ చెప్పిందన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ముంపు ప్రాంతమేనని తెలిపారు. యూసీలు పంపించామనడం సరికాదన్నారు.
మాస్టర్ ప్లాన్ మార్చాలి
రాజధానిలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అప్పులతో రాజధాని అమరావతిని నిర్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయడం తప్పు అని చెప్పారు. మాస్టర్ ప్లాన్ మార్చాలన్నారు.
డీపీఆర్ ఎప్పుడో పంపించాం
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్కు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. గుజరాత్ రాజధానిని అప్పులతో కట్టలేదా అని ప్రశ్నించారు. తాము డీపీఆర్ ఎప్పుడో పంపించామని చెప్పారు. నిధుల ఖర్చుల యూసీలు పంపించామని చెప్పారు.
చంద్రబాబు అందుకే మొక్కారు
ఢిల్లీలో ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా యూటర్న్ అంకుల్ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్న విజయసాయి రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు వేరుగా మండిపడ్డారు. కాటికి కాలు చాచిన విజయసాయి.. చంద్రబాబును అంకుల్ అని పిలవడం హాస్యాస్పదం అన్నారు. విజయసాయితో టీడీపీపై బీజేపీ ఆరోపణలు చేయిస్తోందని, విజయసాయి దొంగ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ మెట్లకు చంద్రబాబు మొక్కడంపై ఆయన స్పందిస్తూ, దేశ ప్రజలకు పార్లమెంట్ దేవాలయంతో సమానమని, అందుకే మొక్కారన్నారు.