టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెరిగిందా?: టీడీపీ 'ఆకర్ష్'పై బీజేపీ నేతల విమర్శలు
అమరావతి: ఏపీలో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీడీపీ ప్రభుత్వంపై మొదటి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా పార్టీ ఫిరాయింపులపై శుక్రవారం విజయవాడలో కాస్తంత ఘాటుగానే స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలను కాకుండా ప్రజలను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరల అదుపుపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. కరువుతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర సమస్యలతో అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఏపీ శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు రాజకీయాల్లో అనైతిక విధానానికి కారణం అవుతున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో ఇటీవల బీజేపీ-టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీడీపీ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో వాటికి గట్టిగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం నగరానికి రైల్వే జోన్ ప్రకటించాలంటే, అందుకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని అన్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి.
ఈ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎవరో వచ్చి ధర్నాలు చేసినంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం రైల్వే జోన్ను ప్రకటించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. అయితే, విభజన చట్టంలో జోన్ ప్రస్తావన ఉన్నందున తామంతా జోన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అందుకున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన, తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బీజేపీ నేతల విమర్శలు ఇరు పార్టీల మధ్య మరింత అగాథాన్ని సృష్టించనున్నాయి.